ఓ.. మైగాడ్….నేరం ఒప్పుకొన్నారు…శిక్ష అనుభవించారు….మర్డర్ అయిన వ్యక్తి తిరిగి వచ్చాడు !

  • Published By: murthy ,Published On : September 11, 2020 / 04:16 PM IST
ఓ.. మైగాడ్….నేరం ఒప్పుకొన్నారు…శిక్ష అనుభవించారు….మర్డర్ అయిన వ్యక్తి తిరిగి వచ్చాడు !

అన్నను హత్య చేశారనే నేరంతో.. అతడి ఇద్దరు సోదరులను పోలీసుల అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు శిక్ష విధించింది. చనిపోయిన వ్యక్తికి ఫిబ్రవరిలో దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. అన్నదమ్ములిద్దరూ జైలు జీవితం గడుపుతున్నారు. చనిపోయాడనుకున్న వ్యక్తి ఆరునెలల తర్వాత తిరిగి వచ్చాడు. తనకు దహన సంస్కారాలు నిర్వహించారని తెలుసుకుని షాక్ కుగురయ్యాడు. ఈ ఘటనపై పోలీసు కేసు పెట్టాడు. దీంతో పోలీసులు కేసును రీ ఓపెన్ చేశారు.

గుజారాత్ లోని ఆరవల్లిజిల్లా ఇస్రీ పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీ మోరి గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక గుర్తు పట్టలేని విధంగా కుళ్లిపోయిన శవాన్ని పోలీసులు కనుగొన్నారు. పోస్టు మార్టం రిపోర్టు, మృతదేహాం వద్ద లభించిన ఆనవాళ్ల ఆధారంగా మృతుడు ఖర్పడా గ్రామానికి చెందిన ఈశ్వర్ మనత్ గా గుర్తించారు. మృతదేహానికి కాలులో ఇనుప రాడ్ వేసి ఉంది. కూలి పనిచేసుకుని బతికే మనత్ కు కూడా యాక్సిడెంట్ అవటంతో కాలిలో ఇనుపరాడ్ వేశారు. వీటి ఆధారంగా మృతదేహం మనత్ ది గా గుర్తించారు.



కేసు విచారణలో భాగంగా పోలీసులు మనత్ ఇద్దరు సోదరులను విచారించారు. విచారణలో అన్నను తామే హత్య చేశామని ఇద్దరు సోదరులు ఒప్పుకున్నారు. పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. జైలులో సోదరులు ఇద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. ఆర్నెల్ల తర్వాత చనిపోయాడనుకున్న ఈశ్వర్ మనత్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతడ్ని చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్య పోయారు. జరిగిన తంతంగం అంతా కుటుంబ సభ్యులు మనత్ కు వివరించారు. తనకు అంత్యక్రియలు కూడా నిర్వహించారని తెలుసుకుని షాక్ కు గురయ్యాడు. జైలులో ఉన్నసోదరులను కలుసుకున్నాడు.

పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేసి నేరం ఒప్పుకునేట్లు చేశారని వారు వివరించారు. మనత్ ఈ విషయంపై గాంధీనగర్ లోని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరిలో ఉపాధి కోసం తాను వేరే ఊరు వెళ్లానని..కరోనా లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకు పోయానని తెలిపాడు. పోలీసులు తన సోదరులను చిత్రహింసలకు గురిచేసి నేరం ఒప్పుకునేట్లు చేశారని ఫిర్యాదు చేశాడు.



ఫిర్యాదును పరిశీలించిన ఐజీస్దాయి అధికారి అప్పట్లో ఈ కేసు విచారించిన ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు. చేయని నేరాన్ని ఒప్పకునేలా చేసిన ఎస్సై తబియాద్ ను సస్పెన్షన్లో ఉంచారు. దహన సంస్కారాలు చేసేసిన మనాత్ తిరిగి రావటంతో పోలీసులు గందరగోళంలో పడ్డారు. కేసు రీ ఓపెన్ చేసిన పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. ఫిబ్రవరిలో దహన సంస్కారాలు నిర్వహించిన వ్యక్తి ఎవరు ? అనే కోణంలో మళ్లీ దర్యాప్తు చేస్తున్నారు.