పాతబస్తీలో కి ‘లేడీ’ : రూ. 10 కోట్ల చిట్టీ డబ్బులతో జంప్

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 07:05 AM IST
పాతబస్తీలో కి ‘లేడీ’ : రూ. 10 కోట్ల చిట్టీ డబ్బులతో జంప్

Chit Fund Fraud In Old City : హైదరాబాద్ పాతబస్తీలో భారీ మోసం వెలుగుచూసింది. ఎంతంటారా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది కోట్ల రూపాయల పైమాటే. చిట్టీల పేరుతో ఓ మహిళ పలువుర్ని నిలువునా ముంచింది. దీంతో పోలీసులను ఆశ్రయించడం బాధితుల వంతైంది. మరి బాధితులకు న్యాయం జరుగుతుందా..?  హైదరాబాద్ పాతబస్తీ పటేల్‌నగర్‌లో భారీ మోసం వెలుగు చూసింది. రూపాయి రూపాయి పోగేసిన వారిని చిట్టీల పేరుతో నిండా ముంచిందో మహిళ.

మాయమాటలు చెబుతూ : –
అంజలి గత కొన్నేళ్లుగా చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తోంది. మాయమాటలు చెప్పి కస్టమర్లను నమ్మించింది. చాలా మంది కస్టమర్లను పోగేసి.. చిట్ నడుపుతోంది. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా.. తన టార్గెట్‌ పూర్తయిందని అనుకుందో ఏమో.. కస్టమర్లకు 10 కోట్ల రూపాయలపైగా కుచ్చుటోపీ పెట్టి ఆ డబ్బుతో జంప్‌ అయింది.  దీంతో 85 మంది బాధితులు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు 250 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతో కష్టపడి తమ కుటుంబం కోసం కూడబెట్టుకున్న డబ్బుతో.. చిట్‌ నిర్వాహకురాలు ఉడాయించిందని బాధితలు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

25 ఏళ్లుగా పటేల్ నగర్‌లో నివాసం : –
చిట్టీల వ్యాపారం నడిపిస్తున్న అంజలి కుటుంబం గత 25 ఏళ్లుగా పటేల్ నగర్‌లో నివసిస్తోంది. ఆమె భర్త బాబురావు CRPF రిటైర్డ్ ఉద్యోగి. 25 ఏళ్ల నుంచి నమ్మకంగా ఉంటుందని చిట్స్ వేసినట్లు బాధితులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటం.. ఫోన్ రెస్పాన్స్ కూడా లేకపోవడంతో బాధితులు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించారు. అంజలి చిట్ ఫండ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో వడ్డీలకు కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చూడాలి మరి బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో.