Delhi : పట్టపగలు నడిరోడ్డుపై ఎమ్మెల్యే భార్యను దోచేసిన దొంగలు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రజాప్రతినిథి భార్యకే టోకరా వేశారు దొంగలు. నడిరోడ్డుమీద పట్టపగలు TMC ఎమ్మెల్యే భార్యను మాయ చేసి కారులోంచి క్యాష్, బంగారం, ఐఫోన్, డాక్యుమెంట్ దోచుకుపోయారు.

Delhi : పట్టపగలు నడిరోడ్డుపై ఎమ్మెల్యే భార్యను దోచేసిన దొంగలు

Tmc Mla Vivek Gupta Wife (1)

TMC MLA Wife Robbed In Delhi : దొంగతనాలు..దోపిడీల్లో ఆరితేరిన దొంగలకు ఎంపీలు..ఎమ్మెల్యేలు..పోలీసులు అనే లెక్కే ఉండదు.కంటికి కనిపించింది చాకచక్యంగా దోచేసుకోవాలి అంతే. అలా ఆరితేరిన దొంగ పోలీసోడి సొత్తే కొట్టేసినట్లుగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రజాప్రతినిథి భార్యకే టోకరా వేశారు దొంగలు. పక్కా ప్లాన్ తో లక్షల రూపాయల నగదుతో పాటు బంగారం, ఐఫోన్ లకు అత్యంత లాఘవంగా దోచేశారునడిరోడ్డుమీద అదికూడా పట్టపగలు. దీంతో సదరు ప్రజాప్రతినిధి భార్య తెల్లముఖం వేయాల్సి వచ్చింది. జరిగింది తెలుసుకుని లబోదిబోమనేలోపు దొంగలు కనుచూపుమేరలో కనిపించకుండా మాయం అయిపోయారు. ఢిల్లీలో శుక్రవారం (జులై 23,2021)తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భార్యనుంచి పక్కా ప్లాన్‌ వేసి రెండు లక్షల నగదు, ఓ గోల్డ్‌ కాయిన్‌, ఐఫోన్‌, డాక్యుమెంట్లు కొట్టేశారు.

అసలు విషయం ఏమిటంటే..పశ్చిమబెంగాల్ కోల్‌కతా, జోరసకో నియోజకవర్గ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా న్యూఢిల్లీలోని లోధి కాలనీలోని ఓ హోటల్‌లో కొన్ని రోజులనుంచి ఉంటున్నారు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వివేక్‌ భార్య కారులో బయటకు వెళ్లగా..2.15 సమయంలో డిఫెన్స్‌ కాలనీ ఫ్లైఓవర్‌ వద్ద కారు వెళుతోంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై కారు వెనుకే వెంబడించారు. అలా కారు దగ్గరకు వచ్చి…కారు టైరును చూపిస్తూ డ్రైవర్ కు ఏదో సైగ చేసి చెప్పారు. కారు గ్లాస్ డోర్లు వేసి ఉండటంతో డ్రైవర్ కు వారు చెప్పింది ఏంటో అర్ధం కాలేదు. దీంతో కారు ఆపి దిగి టైరు పరిశీలిస్తున్నాడు.

అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు మరో బైక్ పై వచ్చి కారు బోనోట్‌ వైపు చూపించారు. డ్రైవర్‌ కారు టైరు దగ్గర నుంచి లేచి బోనోట్‌ దగ్గరకు వచ్చాడు. ఈక్రమంలో కారులో ఉక్కపోస్తోందని ఎమ్మెల్యే వివేక్‌ భార్య కారులోంచి దిగి బయటకు వచ్చారు. అంతే బైక్ పై వచ్చినవారి ప్లాన్ సక్సెస్ అయ్యిందని భావించారు. అదే అదనుగా సదరు బైకర్స్ కారులో ఉన్న రెండు లక్షల క్యాష్, ఓ ఐ ఫోన్‌, గోల్డ్‌ కాయిన్‌ తో పాటు అక్కడే ఉన్న కొన్ని డాక్యుమెంట్లు క్షణాల్లో కొట్టేశారు. వెంటనే అక్కడనుంచి రయ్ మంటూ దూసుకుపోయారు. జరిగిందేమిటో గ్రహించేలోపే అంతా అయిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఎమ్మెల్యే బార్య లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని పోలీసులతో చెప్పగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తక్‌.. తక్‌ గ్యాంగ్‌ పనేనని పోలీసులు భావిస్తున్నారు. దొంగల కోసం గాలిస్తున్నారు.