అత్తింటి వేధింపులకు అల్లుడు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : September 22, 2020 / 06:51 PM IST
అత్తింటి వేధింపులకు అల్లుడు ఆత్మహత్య

Telangana Crime News అత్తింటి ఆరళ్లకు కొత్త కోడలు బలి…. అత్తింటి వేధింపులు భరించలేక కోడులు ఆత్మహత్య… సాధారణంగా ఇలాంటి వార్తలు అడపా దడపా చదువుతూ ఉంటాం, కానీ అత్తింటి వారి వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.

వరంగల్ ఆటోనగర్, తుమ్మలకుంటకు చెందిన పిండి దేవేందర్‌ (25)కు సంగెం మండలం కోట వెంకటాపూర్‌కు చెందిన న్యాల అనూష అలియాస్‌ లావణ్యతో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంత కాలం నుంచి అత్తగారి ఇంట్లో వారితో తరచు గొడవలు జరుగుతున్నాయి.



ఈక్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన అత్త న్యాల రాజమ్మ, బావమరిది అనిల్, భార్య అనూష వారి బంధువులు న్యాల బుచ్చయ్య, రవి, ప్రసాద్‌లు దేవేందర్ ను చెట్టుకు కట్టేసి, బూతులు తిట్టుతూ కొట్టారు.

ఈ ఘటన తో మనస్తాపం చెందిన దేవేందర్‌ అప్పటి నుంచి మానసికంగా చాలా బాధ పడుతున్నాడు. 16వ తేదీన పిల్లలను చూసి వస్తానని ఇంట్లో చెప్పి అత్తగారింటికి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక అత్తింటి వారు పిల్లలను చూపించకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చావని అవమానపరిచారు.



దీంతో మనస్తాపం చెందిన దేవేందర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్‌ చేసి చెప్పాడు.

కాలిన గాయాలతో ఉన్న దేవేందర్ ను స్ధానికులు కొందరు 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడు. మృతుడి తల్లి పిండి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.