కేరళలో కొండ చరియలు విరిగిపడి 15 మంది సజీవ సమాధి

  • Published By: venkaiahnaidu ,Published On : August 7, 2020 / 08:08 PM IST
కేరళలో కొండ చరియలు విరిగిపడి 15 మంది సజీవ సమాధి

గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీగా వరద నీరు చేరడంతో రాష్టంలోని కొన్నిప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్‌, పాలక్కాడ్‌, కొజికోడ్, వయనాడ్‌‌‌, కన్నూర్‌, కాసర్‌గఢ్‌ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్టు జారీ చేసింది. అదే విధంగా మలప్పురం, ఇడుక్కి జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది.

భారీ వర్షాలకు ఇడుక్కి జిల్లాలోని రాజమల వద్ద శుక్రవారం ఉదయం కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో తేయాకు తోట కార్మికులు నివసించే మున్నార్‌ సమీపంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 30 ఇళ్లకు పైగా నేటమట్టమయ్యాయి. ఈ ఇళ్లలో 80 మందికి పైగా నివసిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది సజీవ సమాధి అయ్యారు. .పలువురు గల్లంతయ్యారు.

శిథిలాల కింది నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు. మరో 12 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఘటనా స్థలికి చేరుకుని రిస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేరళ సీఎం పినరయి విజయన్…సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు.మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు కేరళ సీఎం పినరయి విజయన్.

అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.