హైదరాబాద్‌లో రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

రెవెన్యూ శాఖలో భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్(ఆర్ఐ) నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కారు.

  • Published By: naveen ,Published On : June 7, 2020 / 05:20 AM IST
హైదరాబాద్‌లో రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

రెవెన్యూ శాఖలో భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్(ఆర్ఐ) నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కారు.

రెవెన్యూ శాఖలో భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్(ఆర్ఐ) నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో రూ.50కోట్ల విలువైన భూ వివాదం పరిష్కారానికి ఓ వ్యక్తిని రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకుని విచారించగా బంజారాహిల్స్ ఎస్ఐకి ఇందులో ప్రమేయం ఉందని తేలింది. ఎస్ఐ రూ.1.5లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఆర్ఐ, ఎస్ఐలను అరెస్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్ రావు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకి ఎవరైనా సహకరించారా అనే కోణంలో గాంధీనగర్ లోని తహశీల్దార్ సుజాత ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయగా, ఆ ఇంట్లో రూ.30లక్షల నగదు, బంగారు నగలు లభించాయి. నగదను, గోల్డ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

2

అసలేం జరిగిందంటే:
పాత బస్తీకి చెందిన సయ్యద్ ఖాలీద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో 1.20 ఎకరాల స్థలం ఉందని.. సర్వే చేయాలని 2019 డిసెంబర్ లో షేక్ పేట తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఆ భూమి తనదేనంటూ 5 నెలల క్రితం బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ తహశీల్దార్ సుజాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఖాలీద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతుండగానే.. కేసు మాఫీ చేస్తానంటూ ఎస్ఐ రవీంద్రనాయక్ డబ్బు డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే భూమి మీదేనంటూ రాసిస్తానని ఆర్ఐ నాగార్జున సైతం ఖాలీద్ కు చెప్పారు.

 

కేసు మాఫీకి రూ.3లక్షలు లంచం అడిగిన ఎస్ఐ:
ఖాలీద్ పై జనవరిలో కేసు నమోదైన వెంటనే ఎస్ఐ రవీంద్రనాయక్ కేసు మాఫీ చేస్తానని రూ.3 లక్షలు డిమాండ్ చేసి.. ఫిబ్రవరిలో రూ.లక్ష తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఖాలీద్ పై ఏప్రిల్ లో రెండోసారి కేసు నమోదైంది. రెండు కేసులను మాఫీ చేయాలంటే అదనంగా మరో రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి, మరో రూ.50 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఐ ఫోన్ చేసి.. రూ.50 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఎస్ఐ అదనంగా రూ.3 లక్షలు అడగడం, ఆర్ఐ రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన ఖాలీద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనిపై వారికి ఫిర్యాదు చేశారు. 

1

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆర్ఐ:
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. వారి సూచన మేరకు ఆర్ఐకి ఖాలీద్ ఫోన్ చేశారు. ముందుగా రూ.15 లక్షలు ఇస్తానని ప్రతిపాదించగా.. అందుకు ఆర్ఐ అంగీకరించారు. ఖాలీద్ శనివారం(జూన్ 6,2020) నగదుతో బంజారాహిల్స్ లోని షేక్ పేట తహశీల్దార్ ఆఫీస్ కి వెళ్లారు. సమీపంలోని ఒక గల్లీలోకి ఆర్ఐ బుల్లెట్ పై వచ్చి నగదు తీసుకుంటుండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆర్ఐ నాగార్జున్, ఎస్ఐ రవీంద్రను అరెస్ట్ చేశారు. వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఈ కేసుకి సంబంధించి షేక్ పేట్ తహశీల్దార్ సుజాను సైతం ఏసీబీ అధికారులు విచారించారు. ఆదివారం(జూన్ 7,2020) మరోసారి ఆమెను విచారించనున్నారు.

భూవివాదం కేసులో రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ అడ్డంగా దొరికిపోవడం, కేసు మాఫీ చేస్తానని ఎస్ఐ లంచం డిమాండ్ చేయడం సంచలనం రేపాయి. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ శాఖలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లంచం లేనిదే ఏ పని జరగదన్న అపవాదు ఉంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన ఆయా శాఖల ప్రతిష్టను మరింత దిగజార్చింది.