Woman Cheating : ప్రేమ పేరుతో పరిచయం…ముగ్గుర్ని పెళ్లి చేసుకుని, దోచుకున్న కిలాడీ లేడీ
ప్రేమ పేరుతో వల విసిరి, అనాధనంటూ మగవారికి దగ్గరవుతుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
Woman Cheating : ప్రేమ పేరుతో వల విసిరి, అనాధనంటూ మగవారికి దగ్గరవుతుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా విజయపురం మండలం నాగరాజ కండ్రిగకు చెందిన సునీల్ కుమార్ (29) మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. తిరుపతిలో సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఏడీబీ ఫైనాన్స్లో పనిచేసే సుహాసినితో పరిచయం అయ్యింది. కాలక్రంలో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను సునీల్ ఇంట్లో పెద్దలు ఒప్పుకోవటంతో గతేడాది డిసెంబర్ లో ఇద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
పెళ్లిలో సునీల్ తల్లితండ్రులు సుహాసినికి 20 గ్రాముల బంగారం కానుకగా ఇచ్చారు. సుహాసిని కాపురానికి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి సునీల్ తండ్రి వద్ద రూ. 2లక్షలు తీసుకుంది. సునీల్కు తెలియకుండా అతని బంధువుల వద్ద కూడా అప్పులు చేసింది. ఈ విషయం తెలిసిన సునీల్ ఆమెను నిలదీశాడు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గత నెల 8వ తేదీన సుహాసిని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించక పోవటంతో సునీల్ తెలిసిన చోటల్లా ఎంక్వైరీ చేశాడు. ఎక్కడా ఆమె ఆచూకి లభించలేదు. ఇంట్లో వెతకగా ఆమె ఆధార్ కార్డు దొరకింది. ఆ ఆధార్ కార్డ్ ప్రకారం విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్లలున్నట్లు తెలిసింది.
మరో వైపు రెండేళ్ల క్రితం కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుని అతడ్నీ నిండా ముంచినట్లు తెలిసింది. సునీల్ సుహాసినిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తిరుపతి స్విమ్స్ , వివేకానంద సర్కిల్ వద్ద సుహాసిని కనపడటంతో పోలీసుల చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
రెండో భర్త వినయ్ గోడు ఇలా ఉంది..
రెండేళ్ల క్రితం తనను సుహాసిని ఇలాగే మోసం చేసి ముంచిందని కొత్తగూడెనికి చెందిన వినయ్ అనే వ్యక్తి ఇటీవల వీడియో విడుదల చేశాడు. 2018 లో సుహాసిని తనకు ఎవరూ లేని అనాధనంటూ పరిచయం చేసుకుని…. తనను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకోమని కోరటంతో 2019 మే 22న ప్రేమ వివాహం చేసుకున్నానని వినయ్ తెలిపాడు.
పెళ్లి జరిగిన తర్వాత తన కుటుంబ సభ్యులు, బంధువులు వద్దనుంచి తనకు తెలియకుండా రూ.10 లక్షలు తీసుకుందని తెలిపాడు. పెళ్లైన రెండు నెలలకు ఆమె ప్రవర్తనలో మార్పు రావటం గమనించానని వినయ్ తెలిపాడు. నెల్లూరు జిల్లా కోనేటిరాజు పాళేనికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని తన మేనమామ అని పరిచయం చేసిందని చెప్పాడు. అతనే ఆమె మొదటి భర్త అని…అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు పుట్టారని వినయ్ చెప్పాడు.
ఈ విషయమై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ కేసు నమోదు చేయలేదని వినయ్ వాపోయాడు. తానుపోలీసు కేసు పెడుతున్నానని తెలిసిన మర్నాడే ఆమె ఇంటి నుంచి పరారయ్యిందని… పోలీసులు పట్టించుకోక పోవటంతో తానేమి చేయలేకపోయానని వీడియోలో వివరించాడు.
పోలీసులు కూడా పట్టించుకోక పోవటంతో తననెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఈ రకంగా చేస్తోందని వినయ్ వీడియోలో వివరించాడు. మొత్తానికి అలిపిరి పోలీసులకు చిక్కిన కిలాడీ లేడీ ఇంకెంత మందిని మోసం చేసిందో అని పోలీసులు విచారిస్తున్నారు.