కోనసీమలో విషాదం : డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం సూసైడ్
అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక వైద్యుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డారు. అమలాపురంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామకృష్టంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ కృష్ణంరాజు(55) ఆయన భార్య లక్ష్మీ దేవి(45) పెద్ద కుమారుడు కృష్ణసందీప్ (25) ఆత్మహత్య చేసుకున్నారు.
ముగ్గురు పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణ సందీప్ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేయగా. రెండో కుమారుడు కృష్ణవంశీ రాజానగరంలోని జీఎస్ఎల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దురు కుమారుల వైద్యవిద్య కోసం ఒక ప్రయివేటు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. అప్పు విషయమై ప్రయివేటు బ్యాంకుకు చెందిన సిబ్బంది ఇటీవల వచ్చి అప్పుతీర్చమని ఒత్తిడిచేసినట్లు కూడా తెలుస్తోంది.
Also Read : రేపే ఆఖరు రోజు : ఐటీ రిటర్న్ గడువు పెంచలేదు
అమలాపురం లోని డాక్టర్ కృష్ణంరాజు సొంత ఇంటిలో ముగ్గురు విగతజీవులై ఉండగా గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.