అలుగునూర్ ప్రమాదంలో మరో విషాదం…బ్రిడ్జిపై నుంచి కిందపడి కానిస్టేబుల్ మృతి 

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 07:08 AM IST
అలుగునూర్ ప్రమాదంలో మరో విషాదం…బ్రిడ్జిపై నుంచి కిందపడి కానిస్టేబుల్ మృతి 

కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జి ప్రమాదం ఘటనలో మరో విషాదం నెలకొంది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను చూసేందుకు వెళ్లిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ కాలు జారి బ్రిడ్జి పై నుంచి కింద పడి చనిపోయాడు.

కారు లోయర్ మానేరు నదిలో పడటంతో శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్వరూప అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరు భార్యభర్తలు అని తెలుస్తోంది. వీరు కొమరవెల్లి జాతరకు దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి ఒక్కసారిగా బ్రిడ్జిపై ఉన్న రేలింగ్ ను ఢీకొని బ్రిడ్జీ పై నుంచి కిందికి పడిపోయింది. నీరు లేకపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించే అవకాశం ఏర్పడింది. శ్రీనివాస్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్వరూపను చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ ఘటనను చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు బ్రిడ్జి నుంచి కాలు జారి కింద పడ్డాడు. గాయపడ్డ కానిస్టేబుల్ వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చంద్రశేఖర్  మృతి చెందాడు.