నిన్న కూతురు, నేడు భర్త.. భార్య చేసిన తప్పులకు అవమానంతో కళ్యాణ్ ఆత్మహత్య
చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం(జూలై 11,2020) భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కూతురి మరణంతో మనస్తాపానికి తోడు భార్య చేసిన తప్పులకు అవమానంతో కళ్యాణ్ ఈ పని చేశాడు. వారం క్రితం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్లో చిన్నారి ఆద్యను కరుణాకర్ అనే వ్యక్తి కిరాతకంగా గొంతుకోసి చంపాడు. చిన్నారి ఆద్య మరణంతో తండ్రి కళ్యాణ్ తీవ్ర మనస్తాపం చెందాడు. కళ్యాణ్ భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.
అనూష కూతురి గొంతుకోసి చంపిన కరుణాకర్:
ఆ మహిళ చేసిన తప్పుడు పని ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. నిన్న కూతురు బలైంది, నేడు భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అనూష భర్త, పంచాయతీ సెక్రటరీ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాకర్, ఆద్య తల్లి అనూషకి తెలిసిన వ్యక్తి. ఆమెతో అతడికి వివాహేతర సంబంధం ఉంది. కూతురు హత్యతో కళ్యాణ్ మానసికంగా కుంగిపోయాడు. చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో వివాహేతర సంబంధాల కారణంగా అనూష అనే మహిళ తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. అనూష భర్తే కళ్యాణ్. అనూషతో వివాహేతరం సంబంధం ఉన్న కరుణాకర్, అనూష కూతురు ఆద్యను అతి కిరాతకంగా చంపేశాడు. అనూష తనను దూరం పెట్టడాన్ని కరుణాకర్ తట్టుకోలేకపోయాడు. కోపంతో అనూష ఇంటికి వెళ్లిన కరుణాకర్, అనూష కూతురు ఆద్యను గొంతుకోసి చంపాడు.
రెండేళ్ల క్రితం కరుణాకర్తో పరిచయం:
భువనగిరికి చెందిన కల్యాణ్, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష 2011లో ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఆద్య అనే ఆరేళ్ల పాప ఉంది. గత మూడేళ్లుగా వీరు పోచారం మునిసిపాలిటీలోని ఇస్మాయిల్ఖాన్గూడ విహారి హోమ్స్లో నివాసం ఉంటున్నారు. సెల్ఫోన్ వాయిదాల లావాదేవీల విషయంలో రెండేళ్ల క్రితం కరుణాకర్ అనే వ్యక్తితో అనూషకు ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది.
ముందు కరుణాకర్ తో తర్వాత రాజశేఖర్ తో అనూషకు సంబంధం:
భర్త విధులకు వెళ్లిన తర్వాత కరుణాకర్ అనూష దగ్గరికి వచ్చేవాడు. అతడి వెంట అప్పుడప్పుడూ అతడి స్నేహితుడు రాజశేఖర్ కూడా ఉండేవాడు. ఈ క్రమంలో అతడితోనూ అనూష వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనూష సంగతి తేల్చుకునేందుకు ఇటీవల ఆమె ఇంటికి కరుణాకర్ వెళ్లాడు. అక్కడ రాజశేఖర్ చెప్పులు, బైక్ కనిపించడంతో కోపంతో ఊగిపోతూ తలుపులు బాదాడు. ఇంట్లోకి వచ్చిన కరుణాకర్, రాజశేఖర్ను బయటికి రాకపోతే ఆద్యను చంపేస్తానంటూ అరిచాడు. అయినా రాజశేఖర్ రాకపోవడంతో.. కరుణాకర్ కత్తి తీసుకుని చిన్నారి గొంతు కోసేశాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. తీవ్రంగా రక్తం పోవడంతో ఆ చిన్నారి మార్గమధ్యంలోనే చనిపోయింది. కాగా, ఆద్య గొంతు కోసిన కరుణాకర్ తానూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తాను కూడా గొంతు కోసుకున్నాడు. తల్లి మీద కోపంతో ఆరేళ్ల చిన్నారి ఆద్యను అతి కిరాతకంగా చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అందరిని కంటతడి పెట్టించింది. అయ్యో పాపం, ఆ చిన్న పాప ఏం తప్పు చేసింది అని అంతా ఏడ్చారు. తల్లి చేసిన తప్పు ఆ కుటుంబాన్ని చిన్నాబిన్నం చేసింది. నిన్న పాప, నేడు భర్త.. ఇద్దరినీ కోల్పోయింది అనూష.