కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు లాయర్ పై హత్యాయత్నం…

కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు లాయర్ పై హత్యాయత్నం…

attempt murder on lawyer in hyderabad, due to land dispute case : భూమి వివాదానికి సంబంధించి కోర్టులో కేసు ఓడిపోయిన కక్షిదారులు … కేసు ఓడిపోవటానికి లాయరే కారణమని భావించి అతడిపై హత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 7 లో ఉండే హైకోర్టు న్యాయవాది జస్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదించారు. ఇటీవలే ఈ కేసులో కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము ఓడిపోయామని కక్షిదారులు భావించారు.

దీంతో న్యాయవాదిపై కక్షకట్టిన కక్షిదారులు ఈనెల 17వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి అతనితో గొడవకు దిగారు. ఈక్రమంలో న్యాయవాదిపై దాడికి దిగారు. వారిలో కొందరు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టటంతో పాటు కత్తితో పొడించేందుకు సిద్ధమయ్యారు.

ఈ తతంగాన్నంతా చూస్తున్నస్ధానికులు కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించటం చూసి వెనక్కు తగ్గారు. కొందరు 100 కు ఫోన్ చేయటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటం, సంబంధిత ఎస్సైకు కాకుండా మరోకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించటం పలు అనుమానాలకు తావిస్తోంది.