గిరిజన బాలిక హత్య – నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్
auto rickshaw driver cheated and murder tribal minor girl in the name of pretext of marriage : ఒక ఆటో డ్రైవర్ అప్పటికి రెండు పెళ్ళిళ్లు చేసుకున్నాడు. ముచ్చటగా మూడో సారి ఒక గిరిజడన మైనర్ బాలికను ముగ్గులోకి దింపాడు. ఆమెపై లైంగికంగా నెలల తరబడి వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమనే సరికి చంపేశాడు. కానీ చేసిన పాపం ఏదో ఒకరోజు బయటపడకపోదు… చట్టం చేతిలో శిక్ష అనుభవించక తప్పదు.
మెదక్ జిల్లా ఎల్లుపేటకు చెందిన ఆటో డ్రైవర్ మొదటి భార్య అనుమానాస్పద స్ధితిలో మరణించింది. అనంతరం న్యాల్ కల్ మండలం ఇబ్రహీం పూర్ కు చెందిన మరో యువతిని రెండో పెళ్లి చేసుకుని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాపన్న పేటకు చెందిన గిరిజన బాలిక ఎల్లుపేట ఉన్నత పాఠశాలలో చదువుకోటానికి రోజు వచ్చి వెళుతోంది.
ఆ బాలికను స్కూల్ నుంచి తీసుకు వెళ్లి ఇంటి దగ్గర దింపేవాడు ఆటోడ్రైవర్. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపి బాలికను రోజు ఉచితంగా స్కూల్ కు తీసుకువెళ్లి, తిరిగి ఇంటిదగ్గర దింపుతూ ఉండేవాడు. ఈ లోపు 10వ తరగతి అయిపోవటంతో బాలికను హైదరాబాద్ తీసుకువచ్చి వట్టి నాగులపల్లిలో రూం తీసుకుని బాలికతో కాపురం చేయసాగాడు.
ఇలా కొన్నాళ్లు సాగిన తర్వాత బాలిక పెళ్లి చేసుకోమని నిలదీసింది. లేదు అని వెంటనే సమాధానం చెప్పకుండా…ఒకరోజు పాపన్నపేట మండలం గాజులగూడెం శివారులోకి తీసుకువచ్చి మంజీరా నదిపై ఉన్న బ్రిడ్ర్జి మీద నుంచి బాలికను నీటిలోకి తోసేసి చంపేశాడు. అనంతరం బాలిక శవం గతేడాది అక్టోబర్ 31 న ఏడుపాయల వద్ద మంజీరా నదిలో తేలింది. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బాలిక కనపడకపోవటంతో నవంబర్ లో బాలిక తల్లి తండ్రులు పాపన్నపేట పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఏడుపాయల వద్ద దొరికిన శవం, మిస్సింగ్ కేసు నమోదైన బాలిక ఒక్కరే కావటంతో బాలిక తల్లి తండ్రులు ఆటో డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఆటోడ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.