Bengaluru : సన్యాసి వేషంలో నిందితుడు-పారిపోతుండగా కాలిపై కాల్చిన పోలీసులు
మహిళ పై యాసిడ్ దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు, పోలీసులు అతని కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
Bengaluru : మహిళ పై యాసిడ్ దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు, పోలీసులు అతని కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే …. బెంగుళూరుకు చెందిన 23 ఏళ్ల మహిళను, 27 ఏళ్ల నాగరాజు అనేవ్యక్తి పెళ్లి చేసుకోమని వేధించసాగాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఏప్రిల్ 28న నాగరాజు ఆ మహిళ పని చేస్తున్న సంస్ధకు వెళ్లాడు. అక్కడ మరోసారి తనను పెళ్లి చేసుకోమని కోరాడు. అందుకు ఆమె మళ్లీ తిరస్కరించింది.
దీంతో నాగరాజు తనతో తెచ్చుకున్న యాసిడ్ ను ఆ మహిళపై పోసి పరారయ్యాడు. 30 శాతం కాలిన గాయాలతో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన బెంగుళూరులో కలకలం రేపింది. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడి ఊహా చిత్రం విడుదల చేసి నాగరాజు కోసం గాలిస్తుండగా ఎక్కడా అతని ఆచూకి లభించలేదు.
ఈలోపు పోలీసులకు ఒక ఆధారం లభించింది. నిందితుడు దైవభక్తి కలవాడనితెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆశ్రమాలను, దేవాలయాలను, పుణ్యక్షేత్రాలలో తనిఖీ చేయటం ప్రారంభించారు. ఈనెల లో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. నాగరాజు సాధువు వేషంలో కాషాయం దుస్తులు ధరించి చాలా శాంత స్వభావుడిగా ఒక ఆశ్రమంలో సేద తీరుతున్నాడు.
Also Read : Prakasam District : ప్రకాశం జిల్లాలో పెళ్లి చేసుకుని పరారైన భర్త
బెంగుళూరు పోలీసులు శుక్రవారం తిరువణ్ణామలై చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసారు. అక్కడి నుంచి బెంగుళూరు తరలిస్తుండగా మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకువస్తానని చెప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నాగరాజు కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. నాగరాజును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.