దారుణం : పాఠశాలలో 5వతరగతి బాలుడు హత్య

  • Published By: chvmurthy ,Published On : September 3, 2019 / 02:12 PM IST
దారుణం : పాఠశాలలో 5వతరగతి బాలుడు హత్య

బీహార్ : బీహార్ లోని కైమూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుద్రా లోని ఒక ప్రయివేటు స్కూల్లో ఐదో తరగతి చదివే 11 ఏళ్ళ బాలుడు స్కూల్ బాత్రూంలో అనూమానాస్పద స్ధితిలో మరణించాడు. సెప్టెంబరు 2, సోమవారం ఉదయం తన సోదరితో కలిసి స్కూల్ కు వచ్చిన బాలుడు స్కూల్ అయి పోయాక బయటకు రాలేదు. దీంతో  8 వతరగతి  చదివే బాలుడి సోదరి స్కూల్ ఆవరణలో వెతకసాగింది.
 
ఒక చోట అతడి బ్యాగ్ కనపడింది. అక్కడి నుంచి ఆమె వెతుకుతూ వెళ్లగా  స్కూల్ 2వ అంతస్తులోని  ఒక బాత్రూంలో బాలుడు పడి ఉండటం గమనించింది. దగ్గరకు వెళ్ళిచూడగా బాలుడి మెడకు తీగ బిగించి ఉంది. ఆ బాత్రూం డోర్ బయట గడియ పెట్టి ఉంది. స్కూల్ సిబ్బంది వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. బాలుడు సమీప గ్రామంలోని ఒక రైతు కొడుకు. ఇతడి అన్నయ్య గతంలో పాము కాటుతో మరణించాడు. బాలుడి తల్లికూడా అదే స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. కాకపోతే ఆమె సోమవారం తీజ్ పండుగ కారణంగా స్కూలుకు సెలవు పెట్టింది. ఆ సమయంలో ఈదుర్ఘటన జరిగింది.

బాలుడు హత్య వార్త తెలుసుకున్న స్ధానికులు పాఠశాలపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.  జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభింప చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్  డైరెక్టర్, ప్రిన్సిపాల్ తో సహా 7గురిని అరెస్టు చేశారు. పాఠశాలను సీజ్ చేశారు. తల్లిపై ఉన్న విరోధం కారణంగా ఎవరైనా ఈ ఘాతకానికి ఒడిగట్టారా… లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కైమూర్ జిల్లా కుద్రా ప్రాంతంలో ఇది…. ఒక నెలలో జరిగిన మూడవ సంఘటన. కాగా పోలీసులు ఇంతకు ముందు జరిగిన కేసులనే పరిష్కరించలేదని స్ధానికులు ఆరోపిస్తున్నారు.