ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు : ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో పెట్రోల్ పోయించుకుని రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే ఈఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ పేలుడు పెట్రోల్ బంకులో జరిగి ఉంటే పరిస్ధితి ప్రమాదం తీవ్ర స్ధాయిలో ఉండేది. కాగా….. పేలుడు ధాటికి బైక్ పై ఉన్న వ్యక్తి మరణించాడు. అతడి శరీరం తునాతనకలయ్యింది. మహారాష్ట్ర రిజిష్ట్రేషన్ ఉన్న బైక్ లో ఈ ఘటన జరిగింది.
పందులను చంపటానికి మహరాష్ట్ర నుంచి నాటు బాంబులను ఉట్నూరు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తి కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అవటంతో అతడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.