నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు : పెంపుడు కుక్క మృతి
నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది. తుంగతుర్తి మండలం అన్నారంలో బండ్ల పుల్లయ్య పెంపుడు కుక్క నాటు బాంబును కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ వస్తే గానీ నిర్ధారించలేమని పోలీసులు అంటున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలో ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా అడవి పందులను వేటాడే పేలుడు పదార్థమని గ్రామస్తులు అంటున్నారు. ఇదిలావుంటే 1995లో ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు బాంబులు వేసుకున్నారు. అప్పట్లో ఒక వ్యక్తి కూడా చనిపోయారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత గ్రామంలో బాంబు పేలడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.