Anantapur : ప్రియురాలి ఇంట్లో ప్రియుడు అనుమానాస్పద మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. పోలీసు ఇనస్పెక్టర్ ఇక్బాల్ బాషా తెలిపిన వివరాల ప్రకారం…చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కాసిరాళ్ల గ్రామానికి చెందిన వేణుమూర్తి కుమారుడు సురేష్(23) పలమనేరులోని కోళ్ల ఫారంలో పని చేసేవాడు. అదే కోళ్ల ఫారంలో అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లికి చెందిన రామకుమారి(50) అనే వితంతువు కూడా పని చేసేది. ఒకే చోట పని చేయటంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.
ఈక్రమంలో తన చెల్లెలు కుమార్తెతో సురేష్’కు పెళ్ళి చేయిస్తానని నమ్మ బలికి చింతలపల్లికి తీసుకువచ్చింది. గ్రామంలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయసాగారు. ఈ సమయంలో సురేష్ మద్యానికి బానిసయ్యాడు. కొన్నాళ్లు వ్యవసాయ కూలీగా కూడా వెళ్లేవాడు. ఇంతలో సురేష్ ను ఇంటికి తీసుకువెళ్లటానికి వేణుమూర్తి కుటుంబ సభ్యులు గ్రామానికి వచ్చారు. సురేష్ వారితో ఇంటికి రానని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో కత్తితో ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో వారు చేసేదేమి లేక వెను తిరిగి వెళ్లిపోయారు.
ఇటీవల సురేష్కు పచ్చకామెర్ల వ్యాధి వచ్చింది. శనివారం రాత్రి నిద్రపోయిన సురేష్ ఆదివారం ఉదయం లేవలేదు. సురేష్ మరణించినట్లు రామకుమారి గుర్తించింది. సమాచారం తెలుసుకున్న సురేష్ కుటుంబ సభ్యులు గ్రామానికి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తమ కుమారుడికి వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణతో రామకుమారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Honey Trapping : హానీట్రాప్లో ఆర్ఎస్ఎస్ నాయకుడు, బంగారం వ్యాపారి-మహిళ అరెస్ట్