ఉన్మాదం : వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని ప్రియురాలి హత్య

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 01:28 PM IST
ఉన్మాదం : వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని ప్రియురాలి హత్య

ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం లంకపల్లిలో యువతిని యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తనను ప్రేమిస్తూ వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని లంకపల్లిగుట్టల్లో పడేసి వెళ్లాడు. 

పోలీసుల కథనం ప్రకారం… పెనుబల్లి మండలం కుప్పినగుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని, సత్తుపల్లికి చెందిన నితిన్.. గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. పాలిటెక్నిక్ తర్వాత నితిన్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరగా, తేజస్విని కొన్ని సబ్జెక్టులు తప్పడంతో ఇంట్లోనే ఉంటుంది. ఈక్రమంలో తేజ్వసిని వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని భావించిన నితిన్..అమెను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం తేజస్వినిని…నితిన్ తన బైక్ పై ఇంటి నుంచి సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లి ఆమెను చంపేశాడు.   

కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్ డేటాలో నితిన్ నెంబర్ ను గుర్తించారు. అతను ఖమ్మం వసతి గృహంలో ఉంటున్నట్టు గుర్తించారు. నితిన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్లుగా అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 
పోలీసులు ఘటనాస్థలి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు. కాల్ డేటా ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని కల్లూరు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.