కాల్‌మనీ ప్రకంపనలు : వ్యభిచారం చేయిస్తామని బెదిరింపులు.. దంపతుల ఆత్మహత్య

ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 02:03 AM IST
కాల్‌మనీ ప్రకంపనలు : వ్యభిచారం చేయిస్తామని బెదిరింపులు.. దంపతుల ఆత్మహత్య

ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.

ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షలు చెల్లించినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగలేదు. పైగా ఇంట్లోని ఆడవాళ్లతో వ్యభిచారం చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ అవమానం భరించలేక ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మరోసారి కాల్‌మనీ దందా భయాందోళనకు గురిచేస్తోంది. వడ్డీకి వడ్డీ.. దానికి చక్రవడ్డీ పేరుతో.. కాల్‌మనీ రాక్షసులు.. చేస్తున్న అరాచకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తున్నారంటూ రెండు రోజుల కిందట వెంకట్ అనే యువకుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఘటన మరువకముందే మంగళగిరి మండలంలో తాపీ మేస్త్రీ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా  మారింది.

వడ్డీ వ్యాపారుల ఆగడాలు భరించలేక మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ పోలిశెట్టి పూర్ణచంద్రరావు, లక్ష్మి దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు పూర్ణచంద్రరావు దంపతులు రాసిన సూసైడ్ లెటర్.. వడ్డీ వ్యాపారుల అరాచకాలను కళ్లకు కడుతోంది. ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. వడ్డీ వ్యాపారులు తమను ఎలా వేధించారో.. పది పేజీల లేఖలో వాళ్లు వివరించారు. కాల్‌మనీ రక్కసి కారణంగానే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు  విపులంగా రాసిపెట్టారు. 

పూర్ణచంద్రరావు తాపీ మేస్త్రీ. పనుల్లేక పోవడంతో అప్పులపాలయ్యాడు. వడ్డీ వ్యాపారుల వద్ద కేవలం రూ.30 వేలు ఒకసారి, 20వేలు మరోసారి అప్పు తీసుకున్నాడు. 30వేల అప్పుకు లక్షన్నర.. ఇరవై వేల రూపాయలకు సుమారు లక్ష రూపాయలు  కట్టాలని వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురిచేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో తనువు చాలించాడు. అధిక వడ్డీలు.. ఆ వడ్డీకి చక్ర వడ్డీలు కట్టినా వ్యాపారులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.  రూ.10 నుంచి రూ.15ల వడ్డీ కట్టాల్సిందేనని లేకుంటే భార్య, కోడలు, ఆఖరికి చిన్నారి మనవరాలితో కూడా వ్యభిచారం చేయిస్తామని పూర్ణచంద్రరావును బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడంతోనే  ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. 

కాల్‌మనీ వేధింపులతోనే తాము బలవన్మరణం చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్న పూర్ణచంద్రరావు.. వేధింపులకు పాల్పడిన వారి పేర్లతో సహా బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇంటి పక్కనే ఉండే వారి సాయంతో కాల్‌మనీ వ్యాపారులు బెదిరింపులకు  పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాల్‌మనీ వేధింపుల వ్యవహారంలో పోలీసుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరుకు చెందిన ఓ డీఎస్పీ కుమారుడినంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డారని.. పోలీసుల పేరుతో వేధింపులకు గురిచేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.