కొత్త కోణాలు : చిగురుపాటిని చంపింది సొంతవాళ్లేనా

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 01:11 AM IST
కొత్త కోణాలు : చిగురుపాటిని చంపింది సొంతవాళ్లేనా

చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో ట్విస్ట్
రెండు రోజుల క్రితమే జయరామ్ కిడ్నాప్?
పిడిగుద్దులతో కమిలిన జయరామ్ తల, ఛాతి, పొట్ట
అమెరికా నుండి హైదరాబాద్ జయరాం భార్య.

విజయవాడ : ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. జయరాంను రెండు రోజుల క్రితమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జయరాం తల, ఛాతి, పొట్టపై పిడిగుద్దులు గుద్దడంతో.. కమిలిపోయినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద  హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది.

కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలేం జరిగింది..? ఈ ఘటనకు పాల్పడిందెవరు..? కుటుంబ సభ్యులే పొట్టనపెట్టుకున్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌‌లోనే కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను, బ్యాంకు అధికారులను, కారు డ్రైవర్‌ను అధికారులు ప్రశ్నించారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు జయరాం భార్య పద్మ అమెరికా నుండి వస్తున్నారు. ఈమెను కూడా పోలీసులు విచారించనున్నారు. మరి పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.