ప్రియురాలితో ఉండగా చూశాడని బాలుడి హత్య

  • Published By: murthy ,Published On : June 14, 2020 / 05:53 AM IST
ప్రియురాలితో ఉండగా చూశాడని బాలుడి హత్య

ప్రేయసితో తాను కలిసి ఉండగా చూశాడని అభం శుభం తెలియని చిన్నారిని  హత్య చేశాడో కళాశాల విద్యార్ధి. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఊత్తుకులి సమీపంలోని సొట్టకవుండమ్ పాళ్యంలో  నివసించే తంగరాజ్ దంపతులకు విఘ్నేష్(9), పవనేష్ (8) అనే కుమారులు ఉన్నారు.  దంపతులు ఇద్దరూ సమీపంలోని బనియన్ల కంపెనీలో పని చేస్తున్నారు. రోజూ ఉదయానే పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవారు.

ఒకరోజు సాయంత్రం  తంగరాజ్ దంపతులు  పని నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి చిన్న కుమారుడు పవనేష్ కనపడలేదు. వాళ్లు గ్రామంలో వారికి తెలిసిన వారి అందరి ఇళ్లలోనూ వెతికారు. అయినా బాలుడి ఆచూకి లభించలేదు. చివరికి ఊత్తుకులి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు  చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. వారికి ఊరి చివర చెరువువద్ద పవనేష్ మృతదేహం కనపడింది. బాలుడి శరీరంపై రెండు కత్తిపోట్లు ఉన్నాయి. కడుపు, గొంతు భాగాలలో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలతో పోలీసులు కేసు విచారణ చేశారు. నిందితుడు పవనేష్ ఇంటికి సమీపంలోని కాలేజి విద్యార్ధిని  ప్రియుడిగా పోలీసులు గుర్తించారు.

అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.  హత్య జరిగిన రోజు కళాశాలవిద్యార్ధిని తన ప్రియుడితో కలిసి  చెరువు వద్ద సన్నిహితంగా ఉండటం పవనేష్ చూశాడు. ఈవిషయాన్ని ఎక్కడ బయట పెడతాడో ఇంట్లో వాళ్లతో ఇబ్బందులు వస్తాయని ఇద్దరూ భయపడ్డారు. దీంతో ఆ విద్యార్ధి పవనేష్ ను కత్తితో పొడిచి పొదల్లో పడేశాడని తేలింది.  కేసు  దర్యాప్తు కొనసాగుతోంది.