వీడిన కౌకూర్  మృతదేహం మిస్టరీ

వీడిన కౌకూర్  మృతదేహం మిస్టరీ

cops solve Kowkoor dead body case : కౌకూర్ అటవీ ప్రాంతంలో బుధవారం దొరికిన మహిళ మృతదేహాం కేసులో మిస్టరీ వీడింది. ఆ మృతదేహాం నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో వినోభానగర్‌ లో నివసించే చంద్రకళ (43) అనే మహిళ గా గుర్తించారు. మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. చంద్రకళ ఈ నెల 9వతేదీన పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

ఈనెల 10వతేదీన చంద్రకళ కుమారుడు తన తల్లి కనపడటంలేదని నేరేడ్‌మెట్‌ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన పిక్కలి సురేష్‌ (28)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

చంద్రకళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తస్కరించటంతోపాటు ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సురేష్‌ నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి నేరేడ్‌మెట్‌లో ఉంటూ ముగ్గు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతనికి చంద్రకళతో పరిచయం ఏర్పడింది.

ఈనెల 9న చంద్రకళకు పని ఇప్పిస్తానని నమ్మించి…. తన బైక్ పై కౌకూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఒంటిపై నగలు, వెండి దోచుకుని ఆమెను హత్యచేసి నగరానికి తిరిగి వచ్చేశాడు. నిందితునికి నేర చరిత్రఉందని…. ఇతడిపై గతంలో కర్నూలు జిల్లాలోనూ కిడ్నాప్‌ తదితర కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.