కోడెల మృతిపై కేసు నమోదు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. కోడెల మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కోడెల సూసైడ్ కు సంబంధించి ఎటువంటి నోట్ లభించలేదని ఆయన అన్నారు.
సోమవారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్న కోడెల మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్లారు. పని మనిషి ఆయన్ను పిలవటానికి తలుపు కొట్టగా ఆయన తీయలేదు. పని మనిషి కిటీకీలోంచి చూడగా ఆయన ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనపడ్డారు. వెంటనే ఇంట్లో ఉన్న కుమార్తెకు చెప్పి తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను కిందకి దింపి గన్ మెన్ ఇతర సెక్యూరిటీ సహాయంతో గం.11-30 సమయంలో బసవతారకం ఆస్పత్రికి తీసుకువచ్చారు.
ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆయన్ను ఐసీయూ చేర్పించి చికిత్సప్రారంభించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచారని డీసీపీ వివరించారు. కోడెల మరణించిన సమయంలో ఇంట్లో ఆయన భార్య, కుమార్తె, పనిమనిషి ఉన్నారని డీసీపీ తెలిపారు.