సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు మూసివేత 

  • Published By: chvmurthy ,Published On : November 26, 2019 / 03:00 AM IST
సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు మూసివేత 

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతిభవన్ లోని పెంపుడు కుక్క ‘హస్కీ’ మృతి కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు మూసివేశారు. 2019, సెప్టెంబరు 10వతేదీన సీఎం పెంపుడు కుక్క మరణించడంతో, ప్రగతిభవన్ అధికారులు దీనిపై సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హస్కీ కుక్క మృతి చెందటానికి ఇద్దరు పశువైద్యాధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలతో..పశువైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీలపై నగర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాసింది. పెంపుడు కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేయాలని  ఆ లేఖలో కోరింది.
 
కాగా.. పెంపుడు కుక్క హస్కీ కళేబరాన్ని పోస్టుమార్టం చేయగా, అది సహజంగా అనారోగ్యంతోనే మరణించిందని తేలింది. దీంతో తాము ఇద్దరు పశువైద్యాధికారులపై పెట్టిన క్రిమినల్ కేసును మూసివేయాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ సమర్పించారు. 11 నెలల హస్కీ కుక్క అనారోగ్యానికి గురవడంతో దాన్ని బంజారాహిల్స్లోని పెట్ క్లినిక్ లో చేర్చారు. హస్కీ చికిత్స పొందుతూ మరణించడంతో పశువైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్క మరణించిందంటూ పోలీసులు ఐపీసీ సెక్షన్ 429 సెక్షన్ 11 (4) కింద జంతువులపై క్రూరత్వ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చిరంతన్ కడియన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై కేసు నమోదు చేయడంపై పలువురు నెటిజన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.