Manappuram Gold Loan : మణప్పురం గోల్డ్లోన్ సంస్థకు రూ.30 లక్షలు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు
మణప్పురం గోల్డ్లోన్ సంస్ధ ఇటీవల ప్రవేశ పెట్టిన డోర్స్టెప్ లోన్ పధకాన్ని అవకాశంగా తీసుకుని సంస్ధనుంచి రూ. 30 లక్షలు కాజేశారు సైబర్ నేరస్థులు. విషయం గుర్తించిన సంస్ధ గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Manappuram Gold Loan : మణప్పురం గోల్డ్లోన్ సంస్ధ ఇటీవల ప్రవేశ పెట్టిన డోర్స్టెప్ లోన్ పధకాన్ని అవకాశంగా తీసుకుని సంస్ధనుంచి రూ. 30 లక్షలు కాజేశారు సైబర్ నేరస్థులు. విషయం గుర్తించిన సంస్ధ గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వినియోగదారుల సౌలభ్యం కోసం మణప్పురం గోల్డ్లోన్ సంస్ధ ఇటీవల డోర్స్టెప్ లోన్ స్కీం ను ప్రవేశ పెట్టింది. ఈ పధకంలో రుణం కావల్సిన వారు ఆన్లైన్లో కానీ, ఫోన్ ద్వారా కానీ రుణం కోసం అప్లయ్ చేసుకుంటారు. సంస్ధకు చెందిన వాల్యూయర్ ఆ చిరునామాకు వెళ్లి బంగారాన్ని సరి చూసి తన యూజర్ ఐడీ, పాస్వర్డ్తో మణప్పురం పోర్టల్ లోకి లాగిన్ అయి వారి వివరాలు నమోదు చేస్తాడు. మరుసటి రోజు సంస్ధ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఇంటికి వచ్చి వారికి మంజూరైన రుణాన్ని వారి ఖాతాలోకి బదిలీ చేసి బంగారం తీసుకుని వెళతాడు. ఈ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సైబర్ నేరగాళ్లు సంస్ధను రూ. 30 లక్షలకు బురిడీ కొట్టించారు.
హిమాయత్ నగర్ బ్రాంచికి చెందిన వాల్యూయర్, ఎగ్జిక్యూటివ్ల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకున్న కేటుగాళ్లు జూన్ 15న మణప్పురం హెడ్డాఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని వాల్యూయర్ కి చెప్పారు. టెక్నికల్ ప్రాబ్లం వలన మీ వర్క్ పోర్టల్ లోకి అప్లోడ్ కావట్లేదంటూ చెప్పి వారి యూజర్నేమ్ పాస్వర్డ్ తీసుకున్నారు. అదే రోజు ఎగ్జిక్యూటివ్కు ఫోన్ చేసి వాల్యూయర్ కి చెప్పినట్లుగానే చెప్పి యూజర్నేమ్, పాస్వర్డ్ తీసుకున్నారు.
వీటి ఆధారంగా జూన్ 16న హిమయత్ నగర్కు చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్లో లోన్ కోసం అప్లై చేసినట్లుగా చేశారు. ఆ తర్వాత వాల్యూయర్, ఎగ్జిక్యూటివ్లు తమ పని పూర్తి చేసినట్లు చూపిస్తూ 1,210 గ్రాముల బంగారం ఉన్నట్లు రూ. 30 లక్షల రూపాయల రుణాన్ని ఒడిషాలోని ఓబ్యాంకు ఖాతాలోకి ట్రాన్సఫర్ చేసుకున్నారు.
మణప్పురం సంస్ధ ఎప్పటికప్పుడు ముందు రోజు తమ సంస్ధలో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో జూన్ 17న బుధవారం జరిగిన లావాదేవీలన్నిటినీ పరిశీలిస్తోంది. అందులో 1,210 గ్రాముల బంగారం లెక్క తక్కువ వచ్చింది. దీంతో అంత మొత్తానికి రుణం మంజూరు చేసిన వాల్యూయర్, ఎగ్జిక్యూటివ్లను విచారించింది. దీంతో అసలు మోసం బయటపడింది.
వెంటనే వారు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు జరిపారు. మణప్పురం నుంచి వేరే ఖాతాలోకి వెళ్లిన నగదు ఒడిశాలోని బ్యాంకుకు చేరిందని తెలుసుకున్నారు. అదే రోజు అక్కడి బ్యాంకు నుంచి నిందితులు డబ్బుడ్రా చేసి తీసుకువెళ్లినట్లు తేలింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.