Eluru police held Nellore Man : మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
మహిళలకు మాయమాటలు చెప్పి వారితో పరిచయాలు పెంచుకుని వారికి మత్తు బిళ్లలు ఇచ్చి వారివద్ద నగలు,నగదు తీసుకుని పరారయ్యే చంద్రబాబు అనేవ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Eluru police held Nellore Man, due to fraud cases : మహిళలకు మాయమాటలు చెప్పి వారితో పరిచయాలు పెంచుకుని వారికి మత్తు బిళ్లలు ఇచ్చి వారివద్ద నగలు, నగదు తీసుకుని పరారయ్యే చంద్రబాబు అనేవ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా కోట మండలం శ్యాంసుందర పురానికి చెందిన చేపూరు చంద్రబాబు, అలియాస్ శేఖర రెడ్డి, అలియాస్ వంశీకృష్ణ, డబ్బున్న మహిళలను ఎంచుకునేవాడు. వారి ఫోన్ నెంబర్లు సంపాదించి వారితో పరిచయం పెంచుకునేవాడు.
తాను ఆయుర్వేదిక్ డాక్టర్ అని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తుంటానని వారిని నమ్మించేవాడు. ఒక్కో మహిళకు ఒక్కో ఫోన్ నెంబరు నుంచి ఫోన్ చేసేవాడు. వారితో స్నేహం పెరిగిన తర్వాత వారి వద్దకు వెళ్లినప్పుడు, మత్తు బిళ్లలు ఇచ్చి వారి వద్ద ఉన్న నగలు, నగదు తీసుకుని పరారయ్యేవాడు.
ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించేవాడు. ఈవిధంగా గత కొన్నేళ్లుగా నెల్లూరు, తిరుపతి, నాయుడుపేట, గుంటూరు, కృష్ణాజిల్లాలోనూ అనేక నేరాలకు పాల్పడ్డాడు. మహిళల వద్ద దోచుకున్ననగదు, నగలతో జల్సాలు చేయటం అలవాటు పడ్డాడు.
ఇంతవరకూ సుమారుగా 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండటమే కాక, శిక్షలు కూడా అనుభవించాడు. నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్లో చంద్రబాబు పై డీసీ షీట్ కూడా తెరిచారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఒక మహిళను మరోసారి మోసం చేశాడు.
ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి 223 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.9లక్షలు ఉంటుందని అంచనా.