రూ. 40 లక్షల కోసం ప్రియుడితో భర్తను కిడ్నాప్ చేయించిన భార్య
Using fake Covid-19 Report, trio adbucts man in ambulence in Bengaluru, Wife involved : బెంగుళూరు కు చెందిన వివాహిత మహిళ మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇల్లు కొనడం కోసం కూడ బెట్టిన డబ్బు కాజేయాటానికి ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. ఇందుకోసం మాంచి మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ బెడిసి కొట్టి ప్రియుడితో సహా పోలీసులుకు చిక్కింది. సినీ ఫక్కీలో సాగిన ఈ వ్యవహారం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
బెంగుళూరు కు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి ఇల్లు కొనడం కోసం రూ. 40 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఈ డబ్బుపై అతని భార్య కన్నుపడింది. ఆమె అప్పటికే వేరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఉంది. భర్త తెచ్చిన డబ్బు తీసుకుని ప్రియుడితో పరారై హ్యాపీగా గడపాలనుకుంది. ఈవిషయం ప్రియుడికి చెప్పింది. అతని తల్లి, బీబీఎంపీ డాక్టర్ తో కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కోవిడ్ ను తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
ప్లాన్ అమలులో భాగంగా ఓ రోజు తనకు కడుపు నొప్పిగా ఉందని టాబ్లెట్లు తీసుకురమ్మని భర్త సోమశేఖర్ ను కోరింది. దాంతో అతడు సమీప మెడికల్ షాప్ వద్దకు వెళ్లాడు. అప్పటికే ఓ అంబులెన్స్లో రెడీగా ఉన్న బాధితుడి భార్య లవర్, అతడి తల్లి, బీబీఎంపీ డాక్టర్ మెడికల్ షాపు దగ్గరికి వచ్చారు. సోమశేఖర్కి కరోనా పాజిటివ్ అని….. ఆస్పత్రి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాడని అరిచారు. దాంతో స్థానికులు సోమశేఖర్ని పట్టుకుని బలవంతంగా అంబులెన్స్లోకి తోశారు.
అంబులెన్స్ ఆస్పత్రికి కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లింది.అక్కడ సోమశేఖర్ ను బంధించారు. నలభై లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేశారు. దాంతో సోమశేఖర్కి అనుమానం వచ్చింది. తన దగ్గర డబ్బు ఉందని తెలిసిన వారి పనే అని భావించాడు. ఎలాగైనా కిడ్నాపర్ల చెర నుంచి బయట పడాలని నిర్ణయించుకున్నాడు. ఉపాయంతో అపాయంలోంచి బయటపడాలనుకున్నాడు. సరే డబ్బు ఇస్తానని కిడ్నాపర్లకు చెప్పి తన స్నేహితులకు కాల్ చేశాడు.
తన భార్యకు వెంటనే పది లక్షల రూపాయలు ఇవ్వాలని స్నేహితులను కోరాడు. సోమశేఖర్ మాటాల్లో ఏదో తేడా కొడుతోందని భావించిన స్నేహితులు అతడి భార్యకు ఫోన్ చేశారు. ఆమె తన భర్తకు కరోనా వచ్చిందని….. మగాది రోడ్లోని ఆస్పత్రిలో ఉన్నాడని వారికి తెలిపింది. దాంతో సోమశేఖర్ స్నేహితులు ఆస్పత్రికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అతడి భార్య మాటలు అబద్ధం అని తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సోమశేఖర్ భార్యను విచారించారు. దాంతో మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. ప్రస్తుతం పోలీసులు బాధితుడి భార్య, లవర్, అతడి తల్లి, వారికి సాయం చేసిన బీబీఎంపీ డాక్టర్ని అరెస్ట్ చేశారు.