హత్య అంటున్న పోలీసులు : చిగురుపాటిని ఎవరు చంపారు

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 03:51 AM IST
హత్య అంటున్న పోలీసులు : చిగురుపాటిని ఎవరు చంపారు

విజయవాడ: ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్‌ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారు? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం చిగురుపాటి డెడ్ బాడీ లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జయరామ్ తలపై గాయాలు, రక్తపు మరకలు ఉండటంతో అది హత్య అని పోలీసులు నిర్దారించారు.

 

కారులో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చని, మద్యం సీసాలతో తలపై మోదడం, గొంతు నులమడంతో అతను చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. కానీ అందులో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తెలియడం లేదు.

 

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న చిగురుపాటి జయరామ్…ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాల్ డేటా తీస్తే కేసులో కొంత చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కారు వద్ద క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ టీంలు ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చిగురుపాటి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.