హైదరాబాద్‌లో దొంగ నోట్ల కలకలం : పోలీసుల అదుపులో ముఠా సభ్యులు

హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపింది. నకిలీ కరెన్సీ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 04:38 AM IST
హైదరాబాద్‌లో దొంగ నోట్ల కలకలం : పోలీసుల అదుపులో ముఠా సభ్యులు

హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపింది. నకిలీ కరెన్సీ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని

హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపింది. నకిలీ కరెన్సీ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకొచ్చి  హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతరాష్ట్ర ముఠాను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఒక బెంగాలీ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 3లక్షల 98వేల  విలువ గల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తలాబ్ కట్టకు చెందిన మహ్మద్ గౌస్(48), వెస్ట్ బెంగాల్‌కు చెందిన రబీబుల్ షేక్‌(22)లుగా గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన మరో ప్రధాన నిందితుడు అమినుల్ రెహమాన్(32) పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి నకిలీ కరెన్సీ ప్రవేశిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇంకా ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు.

 

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్‌ గౌస్‌ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్‌ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు  ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. ఈజీగా మనీ సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేకమంది  ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి  పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమా,  చార్మినార్, విజయవాడ, విశాఖపట్నం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇప్పటివరకు సిటీలో 13 సార్లు, బయట 2 సార్లు నకిలీ కరెన్సీ కేసుల్లో చిక్కాడు.

 
జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్‌ ప్రస్తుతం తలాబ్‌కట్ట మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. గౌస్‌కు వెస్ట్ బెంగాల్‌లోని బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్‌కు చెందిన అమినుల్‌ రెహ్మాన్‌ అలియాస్‌ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేవాడు. 2016 సెప్టెంబర్‌లో సిటీ పోలీసులకు చిక్కిన గౌస్‌ 2019 జనవరి 12న విడుదలయ్యాడు. బయటకు రాగానే మళ్లీ పని మొదలుపెట్టాడు. రెండేళ్లకు పైగా జైల్లో ఉండటంతో ఇతడి వద్ద బబ్లూ కాంటాక్ట్‌ మిస్‌ అయింది. దీంతో విశాఖ జైల్లో ఉన్న తన పరిచయస్తుడు సిరాజ్‌ షేక్‌ను జనవరి 19న ములాఖత్‌లో కలిశాడు. అతడి నుంచి గౌస్‌ నంబర్‌ తీసుకున్నాడు. అతడితో మాట్లాడి నకిలీ కరెన్సీ సరఫరా చేయమని కోరాడు. రూ.4 లక్షల విలువైన కొత్త 2వేల రూపాయల నోట్లు పంపడానికి అతడు అంగీకరించడంతో అది మార్పిడి చేసి రూ.1.6 లక్షలు తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడు.

 

దీనికి అంగీకరించిన బబ్లూ 2వేల రూపాయల నోట్ల డినామినేషన్‌లో ఉన్న రూ.4 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయస్తుడైన మాల్దా వాసి రబీబుల్‌  షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. షేక్‌ గతంలోనూ సిటీలో నకిలీ కరెన్సీ రవాణా చేసి 2015లో ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడు  మైనర్‌ కావడం గమనార్హం. ఇతడికి సిటీపై పట్టు ఉండటంతోనే బబ్లూ ఆ మొత్తాన్ని ఇతడికి ఇచ్చి పంపాడు. ఇతడికి గౌస్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చిన బబ్లూ నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు  అందించమని చెప్పాడు. దీంతో అతడు ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించాడు.

 

అతడు చెప్పిన ప్రకారం చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించాడు. ఆ మొత్తం నుంచి రూ.2 వేలను ఓ పండ్ల వ్యాపారి వద్ద మార్పిడి చేసిన గౌస్‌ నగదు క్వాలిటీపై సంతృప్తి చెందాడు.  ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.98 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఇంతటి  హైక్వాలిటీతో, సామాన్యులు గుర్తుపట్టలేని విధంగా ఉన్న కరెన్సీ చిక్కడం డీమానిటైజేషన్‌ తర్వాత ఇదే తొలిసారని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ చెప్పారు. ప్రధాన నిందితుడు, వెస్ట్  బెంగాల్‌కు చెందిన మరో నిందితుడు అమినుల్ రెహమాన్ పరారీలో ఉన్నాడు. రెహమాన్ బంగ్లాదేశ్ బార్డర్‌లో ఫేక్ కరెన్సీ ముద్రించి దేశ వ్యాప్తంగా చలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  ఫేక్ కరెన్సీ వ్యవహారం వెలుగులోకి రావడం నగరంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఏవి అసలు, ఏవి నకిలీ అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు.