Family Members Ends Life : అప్పుల బాధ తాళలేక ముగ్గురు తోబుట్టువులు ఆత్మహత్య
తల్లితండ్రులను కోల్పోయినా కష్టపడి సంపాదించుకుంటూ.. సొంతిల్లు కట్టుకుని.. త్వరలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు అర్ధాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
Family Members Ends Life : తల్లితండ్రులను కోల్పోయినా కష్టపడి సంపాదించుకుంటూ.. సొంతిల్లు కట్టుకుని.. త్వరలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు అర్ధాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
హుస్సేని ఆలం పోలీసు స్టేషన్ పరిధిలో… పురానాపూల్ చంద్రికాపురానికి చెందిన కొమరాల లింగేశ్వరరావు దంపతులు 14 ఏళ్ల క్రితం మరణించారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు. కె.మధుసూధనరావు(38) ఎల్ఐసీ ఏజెంట్ గా పని చేస్తుండగా… కుమార్తె(36) ప్రేమలత ఇంట్లోనే ఉంటోంది. వీరికి సందీప్ కుమార్(35) అనే తమ్ముడు ఉన్నాడు.
తల్లితండ్రులు చనిపోయినా.. మేనమామలు, బంధువర్గం వారి సహకారంతో చదువులు పూర్తి చేశారు. కష్టపడి సంపాదించుకుంటున్నారు. స్ధానికంగా అందరితో కలుపు గోలుగా ఉంటూ మంచివారుగా పేరు సంపాదించుకున్నారు. ఏడాదిన్నర క్రితం తమకు ఉన్నపాత ఇంటిస్ధానంలో… అప్పుచేసి రెండంతస్తుల భవనం నిర్నించుకున్నారు.
అప్పులు తీరిపోయాక పెళ్లిళ్లుచేసుకుందామని నిర్ణయించుకున్నారు. గతేడాది నుంచి ఏర్పడిన కరోనా లాక్ డౌన్ సమయంలో వీరి ఆదాయం తగ్గింది. మరో వైపు ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణానికి వడ్డీలు పెరిగిపోసాగాయి. వడ్డీలు కూడా కట్టలేని పరిస్ధితికి వచ్చేసరికి…అప్పిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఏడునెలలుగా ఎవరికీ తెలియకుండా ఇతర ప్రాంతాల్లో తలదాచుకుని జీవనం సాగించారు.
ఈక్రమంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం మే. 21 ఉదయం ముగ్గురు తమ కొత్త ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సందీప్ కుమార్ బేగంబజారులోని తన మిత్రుడు గోవింద్ సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడాడు. మాటల మధ్యలో తాము ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
గోవింద్ సింగ్ అతనిమాటలను పెద్దగా విశ్వసించలేదు. బాధతో అలా చెపుతున్నాడనుకుని విని ఊరుకున్నాడు. కానీ… మధ్యాహ్నం గోవింద్ సింగ్ మళ్లీ సందీప్ కుమార్ కు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సందీప్ ఫోన్ లిఫ్టు చేయకపోయే సరికి అనుమానం వచ్చిన గోవింద్ సింగ్ స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే పోలీసులు సందీప్ కుమార్ ఇంటికి వచ్చి పరిశీలించగా అప్పటికే ఇద్దరు సోదరులు, సోదరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.