రగిలిపోతున్న తమిళనాడు : పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో సినీ,రాజకీయ ప్రముఖులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2019 / 01:32 PM IST
రగిలిపోతున్న తమిళనాడు : పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో సినీ,రాజకీయ ప్రముఖులు

పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసులో అధికార అన్నాడీఎంకే నేతల పేర్లు బయటకి రావడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు సినీనటులకు కూడా ఈ సెక్స్ రాకెట్ లో సంబంధం ఉందన్న ఆరోపణలు వస్తుున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు ప్రధాన నిందితులు శబరిరాజన్,తిరునవుక్కరసు,సతీష్,వాసన్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు… విచారణలో వాళ్లు చెప్పిన భయంకరమైన నిజాలు విని షాక్ అయ్యారు. దాదాపు ఏడేళ్లుగా వందలమంది యువతులతో ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని, వారిపై అత్యాచారానికి పాల్పడటం, వీడియోలు తీయడం, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించడం వంటి దారుణ అరాచకాలకు పాల్పడిన ఈ ముఠాకు అధికార పార్టీ నేతలతోపాటుగా పలువురు సినీనటుల అండదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో ఇంకా అనేకమంది హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో తమిళనాడు అట్టుడికిపోతోంది. మహిళలకు భద్రత,మహిళా సాధికారత అనేవి కేవలం ప్రచార మాటలేనని గాయని చిన్మయి శ్రీపాద ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో మహిళలకు రక్షణ లేదని పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు చూస్తే అర్థం అవుతుందని, ఈ సెక్స్ రాకెట్ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఎంపీ కనిమోళి అన్నారు. మహిళలపై ఇంతటి దారుణాలకు పాల్పడిన  నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.