దారుణం : మరిగిన నూనెలో మహిళ ముఖాన్ని ముంచాడు

  • Published By: madhu ,Published On : February 17, 2019 / 03:33 AM IST
దారుణం : మరిగిన నూనెలో మహిళ ముఖాన్ని ముంచాడు

వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తాము ఇచ్చిన డబ్బులకు వడ్డీలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడానికి దారుణాలకు పాల్పడుతున్నారు. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్న వీరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదని మహిళ ముఖాన్ని మసలుతున్న నూనెలో ముంచాడు ఓ ఫైనాన్స్ వ్యాపారి. ఈ ఘటన విశాఖపట్టణంలోని పాడేరులో చోటు చేసుకుంది. 

పాడేరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద నూకరత్నం వివాహిత మిర్చీ బజ్జీలు వేసుకుంటూ కుటుంబానికి ఆసరగా నిలుస్తోంది. వ్యాపారం కోసం పెంటారావు అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ. 25వేలు అప్పుగా తీసుకుంది. ఇందులో రూ. 10వేల వరకు చెల్లించింది. అయితే కరెక్టు సమయానికి మిగతా డబ్బులు చెల్లించలేకపోయింది. ఫిబ్రవరి 16వ తేదీ శనివారం రాత్రి 10గంటల సమయంలో నూకరత్నం మిర్చీ బజ్జీ పాయింట్ వద్దకు పెంటారావు వచ్చాడు.

డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర లేవని..కొద్ది రోజుల సమయం అడిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన పెంటారావు…దూషించాడు. అంతటితే ఆగకుండా నూకరత్నం ముఖాన్ని మరుగుతున్న నూనెలో ముంచాడు. బాధ భరించలేకపోయిన నూకరత్నం గట్టిగా కేకలు వేసింది. ఇరుగు..పొరుగు వారు రావడంతో పెంటారావు పరారయ్యాడు. స్థానికులు ఆమెను పాడేరు హాస్పిటల్‌కు పంపించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చికిత్స చేసిన వైద్యులు వెల్లడించారు.