Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ-రోడ్డున పడ్డ వందలాది మంది ఉద్యోగులు
సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద ఉన్న క్రేజ్ తో ఒక ఐటీ సంస్ధ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో చోటు చేసుకుంది. దీంతో సుమారు 800 మంది ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.
Hyderabad : సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద ఉన్న క్రేజ్ తో ఒక ఐటీ సంస్ధ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో చోటు చేసుకుంది. దీంతో సుమారు 800 మంది ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ లోని ఇన్నోహబ్ టెక్నాలజీ సంస్ధ సాఫ్ట్ వేర్ జాబ్ పేరుతో ఒక్కో అభ్యర్ధి నుంచి రూ. 2 లక్షల వరకు డబ్బులు కట్టించుకుంది. వారికి రెండు నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా రెండు వారాల క్రితం కంపెనీ వెబ్సైట్, మెయిల్స్, బ్లాక్ చేసింది. దీంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించగా దీనికి సంబంధించిన ఉద్యోగులు, బోర్డు లేకపోవటంతో తామంతా మోసపోయినట్లు గుర్తించారు. బాధిత ఉద్యోగులు మాదాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇంత వరకు పోలీసులు పట్టించుకోవటం లేదని ఈరోజు బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై మాదాపూర్ పోలీసు స్టేషన్ సీఐ రవీంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ….మే 28న హన్మకొండకు చెందిన ఒక యువకుడు తమకు ఫిర్యాదు చేశాడని చెప్పారు. అతని ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కొత్తగూడలోని ఇన్నోహాబ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలిసింది.
ఆ తరువాత బోర్డు తిప్పేసి నిందితులు పారిపోయారు. ఉద్యోగం ఇచ్చిన తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి బుకాయించారు. ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నిరుద్యోగులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నారంటే మీరే ఎం కరేజ్ చేస్తున్నట్లని ఆయన అన్నారు. ప్రస్తుతం కంపెనీకీ సంబంధించి కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్గా గుర్తించాం. వీళ్లంతా హెచ్ ఆర్, మేనేజ్మెంట్కు సంబంధించిన వాళ్లు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.