Andhra Pradesh : నర్సన్నపేట కేంద్రంగా అక్రమ బంగారం దందా

ఉభయ గోదావరి జిల్లాల్లో గోల్డ్‌ జీరో దందా గుట్టు రట్టు కావడంతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్‌ మొదలైంది. నరసన్నపేట కేంద్రంగానే ఈ అక్రమ బంగారం వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు  గుర్తించ

Andhra Pradesh : నర్సన్నపేట  కేంద్రంగా అక్రమ బంగారం దందా

Narasannapeta Gold

Andhra Pradesh :  ఉభయ గోదావరి జిల్లాల్లో గోల్డ్‌ జీరో దందా గుట్టు రట్టు కావడంతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్‌ మొదలైంది. నరసన్నపేట కేంద్రంగానే ఈ అక్రమ బంగారం వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు  గుర్తించారు. నరసన్నపేటలోనే పది మందికి పైగా హోల్ సేల్ బంగారం వ్యాపారులు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతా  ఫోన్ల ద్వారానే వ్యాపారం సాగిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ప్రత్యేక టీమ్‌లు రిటైల్ షాప్‌లకు నేరుగా బంగారం, నగలు డెలివరీ చేస్తున్నాయి. ప్రతీ ఏడాది ఉగాది రోజున 60 కిలోలకు పైగా బంగారం ఇలా అక్రమంగా తరలివెళ్తుందని సమాచారం.

విజయవాడ, గుంటూరు, చెన్నై నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్న హోల్ సేల్ వ్యాపారులు.. అక్కడి నుంచి రిటైల్‌ వర్తకులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, టెక్కలి, రాజాం, ఇచ్చాపురం, సోంపేట, ఆముదాలవలసలలో 600 కి పైగా నగలు దుకాణాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు ఈ అక్రమ దందాలో భాగస్వాములుగా మారాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ట్రావెల్స్‌లో దొరికిన డబ్బులు, బంగారానికి.. బిల్లులు, పత్రాలు సృష్టించి విడిపించేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నట్టు జిల్లాలో టాక్‌ వినిపిస్తోంది. నిన్ననే జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న శ్రీకాకుళం వ్యాపారులు.. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇటు పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లో అక్రమంగా నగదు, బంగారం తరలింపు ఏళ్లుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్టు సమాచారం. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బంగారు వ్యాపారులకు బంగారం అందుతుండగా.. వారు డబ్బుకట్టలను పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ దందా అంతా పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లోనే  కొనసాగుతుంది. రామవరప్పాడు రింగ్‌లో రమేశ్‌, సురేశ్‌, రామకృష్ణా బస్సులకు బంగారం అందజేస్తున్నారు. బిస్కెట్లు, అచ్చులు, ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని వీరు బస్సుల్లో లోడ్  చేస్తున్నారు. పంపిన ప్రతిసారి 10 కేజీల బంగారాన్ని తరలిస్తున్నారు.

ఇలా పంపిన బంగారాన్ని విశాఖ, సోంపేట, నరసన్నపేటలో ఉన్న బంగారం వ్యాపారులకు అందుతుంది. దీనికి ప్రతిగా వారు డబ్బును మళ్లీ అవే పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లో తిరిగి
పంపుతున్నారు. మొత్తం 12 మంది వ్యాపారులు ఈ దందా చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ 12 మంది వ్యాపారులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది. డబ్బు, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దందాను నడిపేవారు ఎవరు? బంగారం, డబ్బు లెక్కల్లోని డబ్బేనా అన్న కోణంలో విచారించనున్నారు అధికారులు. ఇప్పటికే ట్రావెల్స్‌ ఉద్యోగులను పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. బంగారం, డబ్బు అక్రమ రవాణా విషయం ఉద్యోగులకు తెలుసా? లేదా అన్న విషయాలను కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. అసలు ట్రావెల్స్ యజమాని ఎక్కడున్నాడనే  విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
Also Read : Sri Lanka crisis: సోషల్ మీడియాపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే..?
ఇటు తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం టోల్‌గేట్‌ వద్ద పట్టుకున్న నగదు, బంగారాన్ని రాజమండ్రి ట్రెజరీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. మరోవైపు నగదు, బంగారానికి సంబంధించి  ఆదాయపన్ను, జీఎస్‌టీ, కస్టమ్స్‌ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులను ఐటీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. బంగారం దందా చీకటి కోణాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లుగా సాగుతున్న దందా వివరాలను, విజయవాడకు బంగారం ఎక్కడి నుంచి వస్తుందనే విషయాలను కనుగొనేందుకు విచారణ జరుపుతున్నారు.