ఢిల్లీ నుంచి హన్మకొండకు రప్పించి.. వారం రోజులు గదిలో పెట్టి.. బాలికపై అత్యాచారం

ఢిల్లీ నుంచి హన్మకొండకు రప్పించి.. వారం రోజులు గదిలో పెట్టి.. బాలికపై అత్యాచారం

Hanamkonda man trapped delhi girl:  సోషల్ మీడియా వాడకం పెరిగాక ఎక్కడెక్కడెక్కడి వాళ్లు పరిచయం అవుతున్నారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవటం కొత్త విషయాలు తెలుసుకోవటం స్నేహానికి హద్దులు లేకుండా పోయింది. దీనితో పాటే నేరాలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఇన్ స్టా గ్రాంలో పరిచయం అయిన ఢిల్లీకి చెందిన బాలికను హన్మకొండ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నూనె మురళీకృష్ణ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతనికి ఇన్ స్టాగ్రాంలో ఢిల్లీకి చెందిన 10వ తరగతి చదివే 16 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం పరిచయం అయ్యింది. వారి పరిచయం ప్రేమగా మారింది.

రోజు చాటింగ్ లు వీడియో కాలింగ్ లతో కాలం గడిపారు. మురళీకృష్ణ రెండు నెలల క్రితం బాలికను హన్మకొండ రమ్మని ఆహ్వానించాడు. మురళీకృష్ణ ఆహ్వానం మేరకు హన్మకొండ వచ్చిన బాలికను తన గదిలో బంధించి వారం రోజులపాటు అత్యాచారం చేశాడు. ఇంట్లో తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లితండ్రులు ఢిల్లీలోని రాణిగంజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. దర్యాప్తులో భాగంగా బాలిక సెల్ ఫోన్ కు హన్మకొండ నుంచి మురళీకృష్ణ ఎక్కువ కాల్స్ చేసినట్లు గుర్తించారు. జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి కేసును హన్మకొండకు తరలించారు. బాలిక తల్లితండ్రులు జనవరి 14న హన్మకొండకు వచ్చి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే బాలిక తల్లితండ్రులు హన్మకొండ వస్తున్నారని తెలుసుకున్న మురళీకృష్ణ బాలికను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు మురళీకృష్ణ పై నిఘా పెట్టారు. అప్పటికే అతను పరారయ్యాడని తెలుసుకున్నారు. మురళీకృష్ణ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తమిళనాడులోని మధురైలో ఉన్నట్లు గుర్తించారు. ఒక పోలీసు బృందం హుటా హుటిన తమిళనాడులోని మధురై వెళ్లి మురళీకృష్ణను,బాలికను అదుపులోకి తీసుకుని హన్మకొండ వచ్చారు. బాలికను ఆమె తల్లి తండ్రులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.