హాజీపూర్ మర్డర్లు : మరో బావిలో కల్పన మృతదేహం

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 07:09 AM IST
హాజీపూర్ మర్డర్లు : మరో బావిలో కల్పన మృతదేహం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని ఒప్పుకున్న ఈ మానవ మృగం.. మరో విద్యార్థినిని బలిగొన్న విషయాన్ని మంగళవారం (ఏప్రిల్ 30,2019) అంగీకరించాడు.

నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన 6వ తరగతి విద్యార్థిని కల్పనను తానే చంపినట్లు రాచకొండ పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో ఇప్పటివరకు ఈ సైకో బారినపడి బలైన బాలికల సంఖ్య మూడుకి చేరింది. హాజీపూర్ గ్రామంలోని మరో బావిలో కల్పన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి నేరచరిత్రను తెలుసుకునేందుకు ఖాకీలు కూపీ లాగుతున్నారు. ఇన్ని హత్యలు ఒక్కడే చేశాడా? ఇంకెవరైనా సాయం చేశారా అనేదానిపై ఆరా తీస్తున్నారు.

ముగ్గురి హత్యకు కారణమైన శ్రీనివాస్‌రెడ్డిపై హాజీపూర్ గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఊరంతా కలిసివచ్చి తాళం వేసివున్న శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లపై దాడికి దిగారు. రెండు ఇళ్లను ధ్వంసం చేయడమే కాకుండా.. ఓ ఇంటికి నిప్పంటించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.