వెంట తెచ్చుకున్న కత్తే ఆ దొంగను పట్టించింది

  • Published By: venkaiahnaidu ,Published On : January 2, 2020 / 03:37 PM IST
వెంట తెచ్చుకున్న కత్తే ఆ దొంగను పట్టించింది

దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. దేశ రాజధానిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 

హెల్త్ సైన్స్ అండ్ మెనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పొందిన గౌరవ్(28)అనే యువకుడు ఢిల్లీలోని ద్వారకా వీధిలో ఉన్న ఒక ఫార్మసీ షాపులో పనికి కుదిరాడు. అయితే తన పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని గౌరవ్ భావించాడు. దీంతో సోమవారం తన ముఖాన్ని టవల్‌తో చుట్టుకొని టోపీని అడ్డుపెట్టుకొని ఒక కస్టమర్‌లాగా షాపులోకి ప్రవేశించాడు గౌరవ్. ఆ సమయంలో సేల్స్‌మెన్‌ కస్టమర్‌కు మందులను అమ్ముతున్నాడు. షాపులో సేల్స్‌మెన్‌ తప్ప ఎవరు లేకపోవడంతో దొంగతనానికి ఇదే సరైన సమయమని భావించి కస్టమర్‌ వెళ్లిపోయాక షాపు షెట్టర్‌ను మూసేశాడు గౌరవ్. వెంటనే సేల్స్‌మెన్‌ చేతులను కట్టేసి, నోటిలో గుడ్డను కుక్కి రూ. 75 వేల నగదు, రూ. 3వేలు విలువ చేసే మందులను ఎత్తుకెళ్లాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న షాపు ఓనర్‌ క్లోజ్‌ చేసిన షెటర్‌ను తెరవగానే సేల్స్‌మెన్‌ను చూసి షాక్‌ అయ్యాడు. తర్వాత సేల్స్‌మెన్‌ చేతులకున్న కట్లను విప్పేసి అసలు విషయం తెలుసుకొని పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తి కవర్‌ను షాపు ముందు పడేయడం గమనించారు. వెంటనే ఆ కవర్‌ను పరిశీలించగా దాని మీద ఒక బార్‌కోడ్‌ ఉండడంతో స్కాన్‌ చేసి చూడగా 21 స్టోర్స్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి. అన్ని స్టోర్స్‌కు వెళ్లి విచారించగా నిందితుడు ఆ కత్తిని ఫోన్‌ పే ద్వారా మహవీర్ ఎన్ క్లేవ్ లోని స్టోర్ లో కొనుగోలు చేసినట్లు తేలింది. నిందితుడి ఫోన్‌ నెంబర్‌ వివరాలను సేకరించి అతన్ని పట్టుకొని రూ. 65వేల నగదు, మందులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ అల్ఫోన్ తెలిపారు. రూ.10 వేలను నిందితుడు తన అవసరాలకు వాడినట్లు డీసీపీ తెలిపాడు. 

నిందితుడు గౌరవ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. ఇంతకముందు 2010లో వివేక్ విహార్ లో దంపతుల హత్య కేసులో జైలుకెళ్లిన కుమార్‌ 8 సంవత్సరాలు జైలుశిక్షను అనుభవించి 2018లో బెయిల్ పై విడుదలయ్యాడని తెలిపారు.