భార్య తిట్టిందని సుత్తితో కొట్టి చంపాడు

భార్య తిట్టిందని సుత్తితో కొట్టి చంపాడు

కరోనా  వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య  సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్రయించే మహిళలు, భార్యల వల్ల బాధ పడే భర్తలతో కుటుంబాల్లో గొడవలు పెరిగిపోతున్నాయి. భార్య తిట్టిందనే కోపంతో ఆమెను హత్య చేసి… తాను ఆత్మహత్య చేసుకున్న భర్త ఉదంతం తమిళనాడులో వెలుగు చూసింది.

తమిళనాడు లోని గుడువాంజేరి సమీపంలోని వల్లన్ చేరి గ్రామానికి చెందిన  స్టీఫెన్ సన్(52) స్ధానిక బార్ లో పార్సిల్ సప్లయర్ గా పనిచేస్తూ భార్య ఉమ(38) తో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల  నుంచి ఉపాధి లేక పోవటంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి మధ్య ఇంట్లో గొడవలు  పెరిగిపోయాయి.

ఆదివారం  ఏప్రిల్ 26న కూడా ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగటంతో భార్య ఉమ భర్తను తిట్టింది. దీంతో భార్యపై కోపంతో ఊగి పోయిన స్టీఫెన్  పక్కనే ఉన్న సుత్తి తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కొద్ది సేపటికి తేరుకుని క్షణికావేశంలో భార్యను హత్య  చేశానని…. మొదటి భార్య కుమార్తె దివ్యకు ఫోన్ చేసి  చెప్పాడు. తాను చనిపోతున్నానని ఆమెకు  చెప్పి ఫోన్ కట్ చేశాడు.

స్టీఫెన్ మాటలకు కంగారు పడిన దివ్య వల్లన్చేరి లో ఉన్న ఇతర బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి చూడగా అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న ఉమ,  ఇంట్లో  ఇనుప దూలానికి ఉరి వేసుకుని వేలాడుతున్న స్టీఫెన్ కనిపించారు. వారు దివ్యకు సమాచారం అందించారు.సమచారం అందుకున్న గుడువాంజేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జిల్లా అస్పత్రికి తరలించారు.