పెళ్ళిలో పరిచయం అయి, తోడు దొంగలుగా మారారు

పెళ్ళిలో పరిచయం అయి, తోడు దొంగలుగా మారారు

Hyderabad cops arrested thieves in Miyapur : హైదరాబాద్ లో వేర్వేరు వృత్తుల్లో జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ పెళ్లిలో పరిచయమయ్యారు. చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేయటం మొదలెట్టారు. చివరకి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

న్యూహఫీజ్ పేట ఆధిత్య నగర్ లో ఉండే పెయింటర్ ఎండీ మెయిజ్, సెంట్రింగ్ పని చేసే ఎండీ ఇబ్రహీంలు ఒక వివాహాంలో కలిశారు. ఇద్దరూ స్నేహితులుగా మారారు. తమ పనులు తాము చేసుకుంటూ జల్సాలు చేయటం ప్రారంభించారు. సంపాదించిన సొమ్ము జల్సాలకు సరిపోవటంలేదు. అందుకోసం దొంగతనాలు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా చోరీలు మొదలెట్టారు. నవంబర్ 2020 నుంచి ఇప్పటి దాకా మూడు నెలల్లో ఐదు చోరీలు చేశారు.

జనవరి 18న మియాపూర్ లోని ఉషోదయా ఎన్ క్లేవ్ లో పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి చోరీచేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. శనివారం మియాపూర్ ఆదిత్యానగర్ లో అనుమనాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిందితులు నేరం ఒప్పుకున్నారు. వారి వద్దనుంచి 35 తులాల బంగారం, 40తులాల వెండి వస్తువులు, రూ.15 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు.