Rape For Kick : నరరూప రాక్షసుడు.. కిక్కు కోసం చోరీలు, రేప్లు.. ఒంటరి మహిళలే టార్గెట్, 19మందిపై అత్యాచారం
జల్సాల కోసమో, ఈజీ మనీ కోసమో, అవసరాల కోసమో.. చోరీలు, దొంగతనాలు, నేరాలు చేసే వారి గురించి విన్నాము, చూశాము. కానీ, వీడు అలాంటోడు కాదు. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. వీడు దొంగతనాలు చేస్తాడు. ఎందుకో తెలుసా.. కిక్కు కోసం. ఏంటి షాక్ అయ్యారా? కానీ నిజం. మూడు, నాలుగు నెలలకొకసారి ‘కిక్కు’ కోసం చోరీలు చేస్తుంటాడు. కల్లు కాంపౌండ్ల దగ్గర కనిపించే ఒంటరి మహిళలే వాడి టార్గెట్.
Rape For Kick : జల్సాల కోసమో, ఈజీ మనీ కోసమో, అవసరాల కోసమో.. చోరీలు, దొంగతనాలు, నేరాలు చేసే వారి గురించి విన్నాము, చూశాము. కానీ, వీడు అలాంటోడు కాదు. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. వీడు దొంగతనాలు చేస్తాడు. ఎందుకో తెలుసా.. కిక్కు కోసం. ఏంటి షాక్ అయ్యారా? కానీ నిజం. మూడు, నాలుగు నెలలకొకసారి ‘కిక్కు’ కోసం చోరీలు చేస్తుంటాడు. కల్లు కాంపౌండ్ల దగ్గర కనిపించే ఒంటరి మహిళలే వాడి టార్గెట్. వారికి కల్లు తాగిస్తాడు. ఆ తర్వాత తన బండిపై ఎక్కించుకుని శివారు ప్రాంతాలకు తీసుకెళతాడు. అక్కడ అత్యాచారం చేసి కోరిక తీర్చుకుంటాడు. ఆపై నగలు, డబ్బుతో ఉడాయిస్తాడు. అయితే వారికి ఎలాంటి హానీ చేయడు.
మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడి పేరు హుస్సేన్ఖాన్(46). ఈ నీచుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ నారపల్లికి చెందిన హుస్సేన్ క్రైమ్ స్టోరీ తెలుసుకుని పోలీసులే షాక్ అవుతున్నారు. చోరీలు, అత్యాచారాలు చేయడం వల్ల తనకు ఎక్కడ లేని మజా వస్తుందని.. ఇప్పటివరకు 19 మంది మహిళలను ఈ తరహాలో వంచించినట్లు హుస్సేన్ఖాన్ చెప్పడంతో రాచకొండ పోలీసులు కంగుతిన్నారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు ఎన్నో వెలుగు చూశాయి. గురువారం(మే 13,2021) అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు
కల్లు దుకాణాల దగ్గర ఒంటరి మహిళలే టార్గెట్:
2006లో తొలిసారిగా మరో వ్యక్తితో కలిసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల మ్యాన్ప్యాక్(పోలీసుల చేతిలో ఉండేది)ను చోరీ చేశాడు. టాస్క్ఫోర్స్ పోలీసులమంటూ ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అక్కడ కొందరు నేరస్తులు పరిచయమయ్యారు. కల్లు దుకాణాల దగ్గర ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుంటే ఎవరూ పట్టించుకోరని వాళ్లు చెప్పారు. దీంతో అటువైపు దృష్టి పెట్టాడు.
ఫిర్యాదు చేసింది ఇద్దరే:
ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ”నిందితుడిపై గతంలో పీడీ చట్టాన్ని ప్రయోగించి ఏడాదిపాటు చర్లపల్లి జైలుకు పంపాం. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల ఒకటో తేదీన జిల్లెలగూడలోని కల్లు కాంపౌండ్కు వెళ్లిన హుస్సేన్ఖాన్.. అక్కడో మహిళకు మాయయాటలు చెప్పి పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ సమీపానికి తీసుకెళ్లాడు. మహిళ నుంచి చెవి దుద్దులు, మాటీలు, నల్లపూసల తాడు, పర్సులోని రూ.2,500 తీసుకున్నాడు. తన లైంగిక వాంఛ తీర్చుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన హయత్నగర్ పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా గురువారం పెద్ద అంబర్పేటవద్ద హుస్సేన్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటివరకు 19మందిపై అత్యాచారం:
మీర్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, ఛత్రీనాక, కంచన్బాగ్ తదితర ఠాణాల పరిధిలో ఈ తరహా మొత్తం 19 నేరాలనూ తానే చేసినట్లు అంగీకరించాడు. 9 తులాల బంగారం, రూ.45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా 19 మంది మహిళల్లో ఇద్దరే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. ‘నేను కేవలం కిక్కు కోసమే చేశా. మూడు, నాలుగు నెలలకోసారి అలా చేయకపోతే నాకు మజా రాదు. నిద్ర పట్టదు’ అని నిందితుడు వెల్లడించడంతో అధికారులు అవాక్కయ్యారు.
ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడంటే ఆరోజు నేరం పక్కా:
తన కుమారుడి పేరు మీద రిజిస్టర్ అయిన బైక్ పై హుస్సేన్ఖాన్ బయలుదేరుతాడు. ఇంటి నుంచి బయటకు రాగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. అంటే ఆ రోజు ఏదో నేరం చేయబోతున్నాడని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. మళ్లీ ఇంటికొచ్చిన తర్వాతే ఫోన్ ఆన్ చేస్తాడు. సాయంత్రం మాత్రమే మహిళలను బండిపై ఎక్కించుకుంటాడు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లకు సమీపంలోని పొదల చాటుకు తీసుకెళ్తాడు. ఆభరణాలు తీసి డిక్కీలో వేయమంటూ పురామయిస్తాడు. కోరికలు తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి ఉడాయిస్తాడు.