ఫిజియో ధెరపీ సెంటర్ పేరుతో వ్యభిచారం -ముగ్గురు మహిళలు, నలుగురు విటులు అరెస్ట్
Hyderabad police raid on a Massage center : హైదరాబాద్ మహానగరంలో పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి అరెస్టులు చేసినా వ్యభిచార ముఠాలు ఏదో ఒక పేరుతో తమ వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నాయి. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నాయి. స్పా సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు పేరుతో దుకాణాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సెంటర్ గుట్టును సైఫాబాద్ పోలీసులు రట్టు చేశారు.
గతంలో మెహిదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్ లో మెహరాజున్నీసా (45) అనే మహిళ రిసెప్షనిస్టుగా పని చేసింది. దాని యజమాని మసాజ్ సెంటర్ అమ్మేయటంతో ఉపాధి కోల్పోయింది. తానే ఆ మసాజ్ సెంటర్ నిర్వహించాలనుకుని టేకోవర్ చేసింది. మసాజ్ ముసుగులో వ్యబిచారం నిర్వహించటం ప్రారంభించింది. కొన్నాళ్లకు మాసాజ్ సెంటర్ ను పేరు మార్చి మెహిదీపట్నం నుంచి ఏసీ గార్డ్స్ కు మార్చింది.
ఏసీ గార్డ్స్ లో ఫిజియో థెరపీ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు వ్యభిచార ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పక్కాప్లాన్ రచించారు. ఓ కానిస్టేబుల్ ను మఫ్టీలో ఫిజియోథెరపి సెంటర్ కు పంపారు. అతడిచ్చిన సూచనలతో డీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు.
మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ నిర్వాహకులకు డబ్బులు ఇస్తుండగా పోలీసులు దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్ గా నిందితులను పట్టుకున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.