ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. ఇంతలోనే ఆత్మహత్య.. ఓ ఐశ్వర్య విషాదగాధ

ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. ఇంతలోనే ఆత్మహత్య.. ఓ ఐశ్వర్య విషాదగాధ

Young Woman

Young Woman Suicide : హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. 20ఏళ్లకే ఓ యువతికి నూరేళ్లు నిండాయి. తెలిసీ తెలియని వయసులో వేసిన తప్పటడుగులు ఆమె పాలిట మృత్యువు అయ్యాయి. సోషల్ మీడియా అనే మాయా ప్రపంచంలో చిక్కి.. ప్రేమ, పెళ్లి పేరుతో ప్రియుడు చేసిన నయ వంచన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ‘నాన్నా నన్ను క్షమించు.. ఎంతో ఊహించుకున్నా.. వాడు నన్ను మోసం చేశాడు.. భరించలేకపోతున్నా.. వెళ్లిపోతున్నా..’’ అంటూ తండ్రికి సెల్ఫీ వీడియోలు పంపి తనువు చాలించింది.

మీర్‌పేటకు చెందిన ఐశ్వర్య (20) కి మియాపూర్‌కు చెందిన మారెడ్డి అశిర్‌ (21) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. అశిర్ ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో టెలికాలర్‌గా పనిచేస్తాడు. స్నేహం పేరుతో ఐశ్వర్యకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో మరింత క్లోజ్ అయ్యాడు. గతేడాది(2020) ఫిబ్రవరిలో ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. నెలపాటు ఖైరతాబాద్‌లో ఓ అద్దె గదిలో ఉన్నారు.

ఆ తర్వాత అశిర్ అసలు రూపం బయటపెట్టాడు. ఉద్యోగం వదిలేశాడు. అంతేకాదు యువతిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు వారిని మందలించారు. ముందుగా జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ ఘటనలతో ఐశ్వర్య కలత చెందింది. ఇంతలో ఐశ్వర్య గర్భవతి అయినట్లు తెలుసుకున్న అశిర్‌ గర్భస్రావం చేయించాడు. దీంతో ఐశ్వర్య మరింత కుమిలిపోయింది.

20 రోజుల నుంచి బంజారాహిల్స్‌లోని ఓ పేయింగ్‌ గెస్ట్‌హౌస్‌లో మరో ఇద్దరు యువతులతో కలిసి ఐశ్వర్య ఉంటోంది. ఆదివారం(మార్చి 28,2021) మియాపూర్‌లోని అశిర్‌ ఇంటికి వెళ్లింది. తమ విషయం తేల్చాలంటూ అతడి తల్లిని నిలదీసింది. మరో రెండేళ్లు ఆగాల్సిందేనని ఆమె తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఐశ్వర్య గెస్ట్‌హౌస్‌కు వచ్చేసింది. వారి మాటలకు బాగా హర్ట్ అయింది ఐశ్వర్య. తాను మోసపోయానని తెలుసుకుని తీవ్ర నిర్ణయం తీసుకుంది.

సోమవారం(మార్చి 30,2021) రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో తండ్రికి, సోదరుడికి, భర్త అశిర్‌కు వేర్వేరుగా సెల్ఫీ వీడియోలు రికార్డు చేసిన ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియోలు చూసిన తండ్రి షాక్ కి గురయ్యాడు. ఆ వెంటనే కూతురితో పాటు గదిలో ఉండే యువతికి ఫోన్‌ చేసి చెప్పాడు. బయట ఉన్న ఆమె గదికి వెళ్లి చూసేసరికి దారుణం జరిగిపోయింది. ఐశ్వర్య ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిలా కనిపించింది.

ఐశ్వర్య మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంతలోనే అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో పెద్దలకు తెలియకుండా స్నేహం, ప్రేమ చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకుని ఐశ్వర్య పెద్ద తప్పు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20 ఏళ్లకే ప్రేమలో పడి.. పెద్దలకు తెలియకుండా పెళ్లాడి..మోసానికి గురైంది. అయినవాళ్ల ముందు తలెత్తుకోలేక.. నయవంచనను తట్టుకోలేక రెండు పదుల వయసు దాటకముందే బలవన్మరణానికి పాల్పడటం అందరిని ఆవేదనకు గురి చేస్తోంది.

అలాగే.. సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు, యువతులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన చాటింది. సోషల్ మీడియాలో పరిచయాలకు ఆకర్షితులు అయితే, ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.