శభాష్ పోలీస్..సినీ ఫక్కీలో కారుని ఛేజ్ చేసి పట్టుకున్న జగిత్యాల పోలీసులు, కిడ్నాపర్ల నుంచి వ్యాపారిని కాపాడారు
jagtial police: జగిత్యాల జిల్లా పోలీసుల పని తీరు ఓ వ్యాపారి ప్రాణాలను కాపాడింది. వ్యాపారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న కిడ్నాపర్లను ఛేజ్ చేసి మరీ పట్టేసుకున్నారు. పోలీసులు సినీ ఫక్కీలో ఛేజింగ్ చేయడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు షాక్కు గురయ్యారు.
పట్టపగలే వ్యాపారి కిడ్నాప్:
హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి నాగభూషణంను ఓ ముఠా పట్టపగలే కిడ్నాప్ చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. సుమారు 10 మంది వ్యక్తులు వ్యాపారిని దౌర్జన్యంగా కారులోకి ఎక్కించి జగిత్యాల వైపు వెళ్లారు. విషయం తెలుసుకున్న సరూర్ నగర్ పోలీసులు జగిత్యాల జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. సోమవారం(అక్టోబర్ 05,2020) రాత్రి కొడిమ్యాల మండలం దొంగల మర్రి దగ్గర ఎస్ఐ శివకృష్ణ తన సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు.. ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు కారుని ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఐదుగురు కిడ్నాపర్లలో ఇద్దరు పరార్:
కారులో ఉన్న నాగభూషణం తనను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు వెల్లడించారు. అయితే ఐదుగురు కిడ్నాపర్లలో ఇద్దరు పరార్ కాగా.. నిఖిల్ సింగ్, సునీల్ పాటిల్, అజీజ్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిడ్నాపర్లు వాడిన కారును పోలీస్స్టేషన్కు తరలించారు.
కారుపై పోలీస్ స్టిక్కర్ అంటించుకుని కిడ్నాప్:
వ్యాపారి నాగభూషణంను డబ్బుల కోసమే కిడ్నాపర్లు వేధించినట్లు విచారణలో తేలింది. వాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్లాన్ వేశారు. అయితే పోలీసుల పనితీరుతో ముఠా దొరికిపోయింది. కిడ్నాపర్లు ఏకంగా కారుపై పోలీస్ స్టిక్కర్ను అంటించుకుని మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే సినీ ఫక్కీలో ఛేజ్ చేసి మరీ వ్యాపారిని కాపాడడంతో పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 9లో మొక్క జొన్నల వ్యాపారి నాగభూషణం కిడ్నాప్కు గురయ్యారు. మాదాపూర్ కు చెందిన అజీజ్ అనే రౌడీషీటర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నపుడు ప్రత్యక్షంగా నాగభూషణం స్నేహితుడు హరి నాయక్ చూశారు. సీసీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కిడ్నాప్ కేసును వెంటనే పోలీసులు సినీఫక్కీలో ఛేజ్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారిని కాపాడారు.
కోటిన్నర రూపాయల చెల్లింపుల వివాదం:
లాక్డౌన్కు ముందు కోరుట్ల ప్రాంతానికి చెందిన ట్రేడర్ రాజ్భూషన్ ద్వారా రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేశాడు. అందుకు వారికి కోటిన్నర చెల్లించాల్సి ఉంది. ఏడు నెలలు కావస్తుండడంతో రైతుల నుంచి రాజ్భూషన్పై ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం రాజ్భూషన్ కొంత మంది రైతులు, మాదాపూర్కు చెందిన అజీజ్, అతని అనుచరులతో గ్రీన్పార్కు కాలనీలోని నాగభూషణం ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగింది. అజీజ్, అతని అనుచరులు నాగభూషణంపై దాడి చేశారు. అనంతరం 1.30 గంటలకు కారులో బలవంతంగా అతడ్ని ఎక్కించుకుని వెళ్లిపోయారు.
6 గంటల్లో ఛేదించిన పోలీసులు:
సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో నాగభూషణం దగ్గర పనిచేసే సత్యనారాయణ సాయంత్రం సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొడిమ్యాల వైపు కిడ్నాపర్లు వస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులను గమనించి వెంటనే కారును కొడిమ్యాల మండల కేంద్రం వైపు కిడ్నాపర్లు తిప్పారు. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు.
సూరంపేట వెళ్లే దారిలో ఎల్లమ్మ ఆలయ సమీపంలో కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. నాగభూషణంతో పాటు అజీజ్ అతడి అనుచరులను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. డబ్బుల గురించి మాట్లాడేందుకు తీసుకొచ్చామని కిడ్నాపర్లు అంటుండగా, తనను హత్య చేసేందుకే తీసుకొచ్చినట్లు వ్యాపారి నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.