మరో ఉన్మాదం : ప్రేమించలేదని దాడి, అమ్మాయికి తీవ్రగాయాలు

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 12:36 PM IST
మరో ఉన్మాదం : ప్రేమించలేదని దాడి, అమ్మాయికి తీవ్రగాయాలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించడం లేదని డిగ్రీ విద్యార్థిని భార్గవిపై సాయి అనే యువకుడు స్క్రూడైవర్ తో దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో అమ్మాయి ఛాతి, మెడ కింద భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. భార్గవిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషంగా ఉందని డాక్టర్లు చెప్పారు. రామచంద్ర థియేటర్ దగ్గర ఈ దారుణం జరిగింది. భార్గవి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. 

కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన భార్గవిపై సాయి దాడి చేశాడు. స్థానికులు వెంటనే ఉన్మాది సాయిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో భార్గవి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలేజీ దగ్గర జరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉన్మాది సాయిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

భార్గవి, సాయి ఇద్దరిదీ రామచంద్రాపురం కాలనీ. కొంత కాలంగా ప్రేమ పేరుతో భార్గవి వెంట పడుతున్నాడు. ఇందుకు భార్గవి తిరస్కరించడంతో సాయి పగ పెంచుకున్నాడు. అదను చూసి దాడి చేశాడు. లోతైన గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. భార్గవి వెంట పడొద్దని సాయిని పలుమార్లు హెచ్చరించామని బాధితురాలి బంధువులు తెలిపారు. అయినా సాయి తన తీరు మార్చుకోలేదన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని భార్గవిపై సాయి ఒత్తిడి తెస్తున్నాడని చెప్పారు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపారు.

భార్గవి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. పెళ్లి విషయమై భార్గవి కుటుంబసభ్యులతో సాయి మాట్లాడాడు. దీనికి భార్గవి, ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో భార్గవిపై కక్ష పెంచుకున్న సాయి ఉన్మాదానికి ఒడిగట్టాడు. బుధవారం(ఆగస్టు 28,2019) కాలేజీ దగ్గరికి వచ్చిన సాయి.. భార్గవిని స్థానిక థియేటర్ లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సాయి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో భార్గవిపై దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.