కశ్మీర్ బీజేపీ నాయకులపై కొనసాగుతున్న ఉగ్రదాడులు… బీజేపీ సర్పంచ్ కాల్చివేత

  • Published By: venkaiahnaidu ,Published On : August 6, 2020 / 02:55 PM IST
కశ్మీర్ బీజేపీ నాయకులపై కొనసాగుతున్న ఉగ్రదాడులు… బీజేపీ సర్పంచ్ కాల్చివేత

కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్‌ని తీవ్రవాదులు అత్యంత దారుణంగా కాల్చిచంపారు.



తీవ్రవాదులు… కుల్గాం జిల్లాలోని వెస్సూ గ్రామంలో బీజేపీ సర్పంచ్ సజాద్ అహ్మద్ ఖాండే ఇంటికి వచ్చి మరీ ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆయనని అనంత‌నాగ్‌లోని జీఎంసీ ఆస్ప‌త్రికి తరలించారు. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం తెల్ల‌వారుజామున ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

అయితే ఈ కాల్పులు ఘటనకు ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత స్వీకరించలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రాథమిక సమాచారం మేరకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందున సజాద్ అహ్మద్…సర్పంచ్‌ల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో గత కొంతకాలంగా తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తమ కుటుంబీకులను చూసి వచ్చేందుకు తమ గ్రామానికి వెళ్లగా…విషయం తెలుసుకున్న తీవ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు.



గత 48 గంటల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లోబీజేపీ సర్పంచ్‌లను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. కాగా,ఆగ‌స్టు 4న కుల్గాం జిల్లాలో బుధవారం తీవ్రవాదులు జరిపిన దాడిలో అరిఫ్ అహ్మద్ షా అనే బీజేపీ సర్పంచ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.



కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లే టార్గెట్‌గా తీవ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. జులై మాసంలో బంధిపొరాలో బీజేపీ నేత వసీం అహ్మద్ బారి, ఆయన తండ్రి, సోదరుడిని తీవ్రవాదులు కాల్చి చంపారు. బందిపొరా పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ దాడి ఘటన జరిగింది. జూన్ 8న అనంతనాగ్‌ జిల్లాలో బీజేపీ సర్పంచ్ అయిన…కశ్మీరీ పండిత్ అజయ్ పండితను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.