రూ. 5 కోసం ఘర్షణ : కత్తితో దాడి..ఒకరికి తీవ్రగాయాలు

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 01:39 AM IST
రూ. 5 కోసం ఘర్షణ : కత్తితో దాడి..ఒకరికి తీవ్రగాయాలు

రూ. 5 కోసం ఘర్షణ పడ్డారు. ఇంకేముంది..క్షణికావేశంలో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఫలితంగా..ఇద్దరికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హర్యాణాలోని ఓ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. కత్తితో దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే…
బల్లాబార్గ్ ప్రాంతానికి చెందిన..జిత్తు, నిఖిల్, ఫరిదాబాద్ ప్రాంతానికి  చెందిన మోహిత్, దీపక్ లు కారులో వెళుతున్నారు. హర్యాణ రాష్ట్రంలోని కేర్కిదేలా టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. రూ. 65 చెల్లించాలని చెప్పారు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది. దీంతో వారు రూ. 100 తీసిచ్చారు. మిగతా రూ. 35ను కారులో ఉన్న వారికి అందచేశారు. అయితే..వారికి అందచేసే క్రమంలో రూ. 5 కాయిన్ కిందపడిపోయింది. వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక ఇతర వాహనాలు నిలబడి ఉన్నాయి.

దీంతో కారును పక్కకు తీసి..కిందపడిపోయిన రూ. 5 కాయిన్ ను తీసుకోవాలని సిబ్బంది సూచించారు. వారు తీసుకోకుండా..టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే కారులో ఉన్న కత్తిని తీసుకుని సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ప్లాజా మేనేజర్ తో పాటు మరో ఉద్యోగిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

దీనిని అడ్డుకొనేందుకు మరొక ఉద్యోగి ప్రయత్నించాడు. అతడిపై కూడా దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా..తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు..కుప్పకూలి..రక్తపు మడుగులో ఉన్న మేనేజర్, సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు కారులో పరార్ అయ్యారు. పోలీసులు వెంబడించి..వారిని అదుపులోకి తీసుకున్నారు. టోల్ ప్లాజా మేనేజర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

Read: చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య… గత నెలలో యువతికి వేరే అబ్బాయితో వివాహం