Kurnool : భూత వైద్యుడు దెబ్బలకు మృతి : స్ధానికుల ఆరోపణలతో రీ-పోస్టుమార్టం
కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో అనుమానాస్పద స్ధితిలో మరణించిన నరేష్ మృతదేహానికి పోలీసులు ఈరోజు రీ పోస్టుమార్టం నిర్వహించారు. భూత వైద్యుడు కొట్టిన దెబ్బల కారణంగా మరణించాడనే ఆరోపణలు రావటంతో పోలీసులు శవాన్ని వెలికి తీశారు. అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.
Kurnool : కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో అనుమానాస్పద స్ధితిలో మరణించిన నరేష్ మృతదేహానికి పోలీసులు ఈరోజు రీ పోస్టుమార్టం నిర్వహించారు. భూత వైద్యుడు కొట్టిన దెబ్బల కారణంగా మరణించాడనే ఆరోపణలు రావటంతో పోలీసులు శవాన్ని వెలికి తీశారు. అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.
మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వెంకటరాముడు, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు నరేష్ (24) డిగ్రీ వరకు చదివి గ్రామంలోనే వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 1వ తేదీన మూర్ఛతో అస్వస్ధతకు గురి అయ్యాడు. తల్లితండ్రులు స్ధానికంగా ఉన్న భూతవైద్యుడి వద్దకు తీసుకువెళ్ళారు.
భూత వైద్యుడు దగ్గర ఉండగా స్పృహ కల్పోయిన నరేష్ను కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 3 రోజులు చికిత్సపొంది ఆదివారం నరేష్ మరణించాడు. వారి కుటుంబ పరిస్ధితి బాగోలేక పోవటంతో మిత్రులే డబ్బులు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే గ్రామస్తులు భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకు చనిపోయాడని ఆరోపించటంతో పోలీసులు రీ పోస్టు మార్టం నిర్వహించారు.
వీఆర్వోతో ఫిర్యాదు తీసుకున్న సీఐ నారాయణ రెడ్డి ఈరోజు శవాన్ని వెలికితీసి స్థానిక తహశీల్దార్, డాక్టర్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. మేము ఎవరినీ కొట్టమని… ఆంత్రం వేశామే తప్ప, కొట్టలేదని పోలీసు విచారణలో భూతవైద్యుడు వెల్లడించాడు. తమ కుమారుడు గతంలోనే రెండు మూడు సార్లు ఆస్పత్రికి వెళ్ళివచ్చాడని మృతుడి తండ్రి పోలీసులకు వివరించాడు.
ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడని…కుమారుడు అనారోగ్యంతోనే మరణించాడని తండ్రి వెంకట రాముడు పోలీసులకు తెలిపారు. ఈకేసులో మృతుడి తండ్రి వాంగ్మూలం కూడా తీసుకున్నామని, పంచనామా రిపోర్టు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకుంటామని మద్దికెర ఎస్.ఐ తెలిపారు.