అప్పుడే పెళ్లోద్దు… కొన్నాళ్లు ఆగుదాం : తొందరపడి ప్రేయసి ప్రియులు ఆత్మహత్య

అప్పుడే పెళ్లోద్దు… కొన్నాళ్లు ఆగుదాం : తొందరపడి ప్రేయసి ప్రియులు ఆత్మహత్య

Lovers commit suicide Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని నందిపేట్‌ మండలం ఖుదావంద్‌పూర్‌కు చెందిన ప్రేమికులు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఖుదావంద్ పూర్ కు చెందిన డీకంపల్లి సుకన్య(21), అయిలాపూర్‌కు చెందిన ప్రేమ్‌ కుమార్‌(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేశారు.

ఇద్దరివి పక్కపక్క గ్రామాలే. నాలుగేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అమ్మాయి ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆమెకు పెళ్లి చేసేందుకు ఇంట్లో పెద్దవారు మాట్లాడుకున్నారు. ఈవిషయం విన్న సుకన్య ఆదివారం రాత్రి తన ప్రియుడు ప్రేమ్ కుమార్ కు వాట్సప్ లో విషయం చెప్పింది. త్వరగా పెళ్ళి చేసుకుందామని కోరింది. అయితే కొన్నాళ్లు ఆగి పెళ్ళి చేసుకుందామని చెప్పాడా యువకుడు..

ప్రియుడి మాటలకు మనస్తాపానికి గురైన సుకన్య సోమవారం ఉదయం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలోంచి శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే సుకన్య మృతి చెందింది.  అయిలాపూర్‌లో ఉన్న ప్రియుడు ప్రేమ్‌కుమార్‌కు ఈ విషయం తెలియడంతో గ్రామ శివారులో చెట్టుకు   ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరు కుటుంబాల వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.

కాగా ….సుకన్య తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. ఆమె పెద్దక్క కుటుంబ కలహాల కారణంగా గతంలో ఆత్నహత్య చేసుకుని తనువు చాలించింది. ప్రేమ్‌కుమార్‌ ఇంట్లో సోమవారం అతని అన్న భార్యకు సీమంతం పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఆ ఏర్పాట్లలో ఉండగా.. ప్రేమ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.