Mobile Phone Theft : సెల్ఫోన్ దాచిపెట్టాడని కొట్టి చంపి, కాల్చేశారు
మద్యం సేవించిన సమయంలో సెల్ఫోన్ తీసి దాచిపెడితే..దానికోసం ఒక స్నేహితుడిని కొట్టి చంపి, కాల్చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Mobile Phone Theft : మద్యం సేవించిన సమయంలో సెల్ఫోన్ తీసి దాచిపెడితే..దానికోసం ఒక స్నేహితుడిని కొట్టి చంపి, కాల్చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జున్ 21న ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహాం లభ్యం అయ్యింది.
ఆ విషయమై హెచ్ఎండీఏ సూపర్వైజర్ నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకి పంపించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నగరంలో మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు.
ఐడీపీఎల్ కాలనీకి చెందిన బాలరాజు(22) జూన్ 20వ తేదీ సాయంత్రం స్నేహితులతో కలిసివెళ్లాడని..అప్పటి నుంచి కనిపించటంలేదని బాలానగర్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. అనుమానాస్పద మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా చనిపోయిన యువకుడు బాలరాజుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు చెప్పిన అనుమానితులను పోలీసులు విచారించగా నిందితులు హత్యకు దారితీసిన పరిస్ధితులు వివరించారు.
ప్రధాన నిందితుడు మహేశ్కు బాలరాజుతో ఆరేళ్లుగా పరిచయం ఉంది. జూన్ 20 వ తేదీ మధ్యాహ్నం మహేశ్ తన స్నేహితులు నాగరాజు, సాయిలతో సనత్ నగర్ జింకల బావి కల్లు కాంపౌండ్లో కల్లు తాగుతున్నాడు. ఆ సమయంలో బాలరాజు అక్కడకు వచ్చి వారితో పాటు మద్యం, కల్లు తాగాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం మహేష్ తన ఫోన్ కోసం చూసుకోగా అది కనపడలేదు. బాలరాజుపై అనుమానం వచ్చి మహేష్ అతడి ఇంటికి వెళ్లి అడిగాడు. తనకు తెలియదని చెప్పాడు. తన స్నేహితులతో కలిసి బాలరాజును తీసుకుని మహేష్ తన ఇంటికి చిలుకా నగర్ వచ్చాడు. అక్కడ బాలరాజును మహేష్ ఫోన్ గురించి అడుగుతూ విపరీతంగా కొట్టాడు. దీంతో బాలరాజు విషయం చెప్పాడు. ఫోన్ను తాను పనిచేసే కిరాణా షాపు యజమాని దేవేందర్ కు ఇచ్చినట్లు చెప్పాడు.
రాత్రి గం.10-30 కి మహేశ్ పెద్ద అన్న నరేశ్, తమ్ముడు సుధీర్ మహేశ్ ఇంటికి బాగా మద్యం సేవించి వచ్చారు. మహేష్ ఫోన్ విషయం వాళ్లకు చెప్పాడు. ముగ్గురూ కలిసి మళ్లీ బాలరాజును చితక బాదారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు బాలరాజు మరణించాడు. మృతదేహాన్ని మహేష్ ఆటోలో తరలించాడు. సుధీర్ బైక్పై వెంట రాగా హెచ్ఎండీఏ లేఅవుట్ లో కిరోసిన్ పోసి తగల బెట్టారు. మహేశ్ అతని భార్య విజయ, నరేష్, సుధీర్ నిందితులకు ఆశ్రయం ఇచ్చిన కేతావత్ రవిలను పోలీసులు అరెస్ట్ చేశారు.