పానీపూరీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు
ఐదు రూపాయల కోసం ప్రాణాలు తీసుకోవడం సినిమాల్లో చూశాం.. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు పోవడం చూస్తున్నాం. సరిగ్గా అటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయింది. ఒక చిన్న పానీపురి గొడవ కన్న వాళ్లకు, కావలసిన వాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చింది.
పహాడీషరీఫ్ ఠాణాలో తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్ మద్యం సేవించి మత్తులో తన బైక్పై స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్దకు పానీపూరీ తినేందుకు వెళ్లాడు. అక్కడి వ్యాపారితో పానీపూరీ కావాలని అడిగాడు. పానీపూరీ అమ్ముకునే వ్యక్తి లేదు అయిపోయిందని చెప్పగా అక్కడ గొడవ మొదలైంది. నాకే పానీపూరీ లేదని సమాధానం ఇస్తావా అంటూ శ్రీనివాస్ అతనితో ఘర్షణకు దిగాడు. అక్కడ పక్కన ఉన్నవారు వారిస్తున్నా కూడా శ్రీనివాస్ వినలేదు. గొడవ పడుతూనే శ్రీనివాస్ పానీపూరి బండిపై గట్టిగా చేతితో బాదాడు. దీంతో.. అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్ కుడి చేతి నరం తెగడంతో తీవ్రగాయమైంది. గాజు ముక్కలు శరీరంలో ఇరుక్కుని రక్తం తీవ్రంగా కారింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి అతనిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చాలా రక్తం పోవడంతో శ్రీనివాస్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తం పోవడంతో శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తుక్కుగూడలోని మృతుని ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.